పట్నా: బిహార్లో భారీ వరదల మధ్య పూర్ణియాకు చెందిన స్వతంత్ర ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున నగదు అందించడంతో పాటు బియ్యం, అటుకులు, పిండి, ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. మహిళలకు శానిటరీ ప్యాడ్లు అందించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పడవలను కూడా ఏర్పాటు చేశారు.
పట్నాలోని దీఘా ఘాట్, పూర్ణియా, కటిహార్, రాఘోపూర్ ప్రాంతాల్లో పప్పూ యాదవ్ సహాయక సామగ్రి పంపిణీ చేశారు. వరద నీటిలోకి వెళ్లి బాధితులను కలుస్తున్న ఆయనకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వద్ద ఉన్న ఆస్తులపై కూడా చర్చ మొదలైంది.
సహాయక చర్యల సందర్భంగా పప్పూ యాదవ్ తన వద్ద ప్రభుత్వం వద్ద ఉన్నదానికంటే కూడా ఎక్కువ డబ్బు ఉందని వ్యాఖ్యానించారు. రేషన్ సరిపోకపోవడంతో ప్రజల అవసరాలు తీర్చేందుకు నేరుగా నగదు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. పట్నాలో సహాయక సామగ్రి పంపిణీ సమయంలో జనాల రద్దీని ఉపయోగించుకుని ఆయన బ్యాగ్ లేదా జేబు నుంచి సుమారు రూ.లక్ష చోరీ అయినట్లు కూడా సమాచారం వెలువడింది. వరద సహాయక చర్యలపై బిహార్, కేంద్ర ప్రభుత్వాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
గత లోక్సభ ఎన్నికల సమయంలో పప్పూ యాదవ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ రూ.12,08,84,682, అంటే సుమారు రూ.12.08 కోట్లు. ఆయన మొత్తం అప్పులు రూ.1,72,36,808, అంటే సుమారు రూ.1.72 కోట్లు అని అందులో పేర్కొన్నారు.
అఫిడవిట్ ప్రకారం ఆయనకు ఇన్నోవా కారు, సుమారు 204 గ్రాముల బంగారం ఉన్నాయి. నివాస, వాణిజ్య భూములకు సంబంధించిన స్థిరాస్తులు కూడా అందులో నమోదయ్యాయి. అయితే ఇవి 2024 ఎన్నికల సమయంలో స్వయంగా ప్రకటించిన వివరాలు మాత్రమే.


