కుంభమేళలో భారీగా కరోనా కేసులు! | Over 1,700 Test Positive For COVID19 In Kumbh Mela Over 5 Days | Sakshi
Sakshi News home page

కుంభమేళలో భారీగా కరోనా కేసులు!

Apr 15 2021 8:47 PM | Updated on Apr 15 2021 9:36 PM

Over 1,700 Test Positive For COVID19 In Kumbh Mela Over 5 Days  - Sakshi

లక్నో: కుంభమేళాలో కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఏప్రిల్‌ 10 నుండి 14 తేదీల మధ్య కాలంలో 2,36,751 మందిని పరీక్షించగా.. 1,701 మంది కరోనా బారిన పడ్డారు. అయితే మరిన్ని ఆర్టీపీసీఆర్‌ నివేదికలు రావాల్సి ఉంది. ఈనేపథ్యంలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగానది తీరాన నిర్వహించే కుంభమేళా ఏప్రిల్‌ 1 నుండి ఈనెల 30వ తేది వరకు జరుగనున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే, ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికేట్‌ ఉన్న యాత్రికులకు మాత్రమే పవిత్ర స్నానాలకు అనుమతిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా ఏప్రిల్‌ 12,14,27 తేదిల్లో షాహీస్నాన్‌ నిర్వహిస్తారు. ఈ రోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తారు. గత 12 వ తేదినాటి షాహీస్నాన్‌ కార్యక్రమం వలన భక్తులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డారని ఉత్తరఖండ్‌ ప్రభుత్వం భావిస్తుంది. కాగా, కుంభమేళ 670 హెక్టార్లలో హరిద్వార్‌, టెహ్రీ, డెహ్రాడూన్‌ జిల్లాలలో విస్తరించి ఉంది.

ఏప్రిల్‌ 12న సోమవతి అమావాస్య సందర్భంగా జరిగిన షాహిస్నాన్‌లో పాల్గొన్న 48.51 లక్షల మందిలో చాలా మంది కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, అక్కడ ప్రభుత్వం, వైద్య సిబ్బంది, పారామిలటరీ సిబ్బంది, కరోనా నిబంధనలు పాటించేలా..  భక్తులకు వారికి కేటాయించిన స్లాట్‌ సమయాల్లోనే పవిత్ర స్నానాలను ముగించుకొవాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. అయినప్పటికి చాలా మంది కోవిడ్ నిబంధనలు పాటించడంలేదు. దీనితో రానున్న రోజుల్లో మరిన్ని కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఉత్తరఖండ్‌ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement