
ముంబై : నగరంలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో రద్దీ కారణంగా చోటు చేసుకున్న అత్యంత హృదయ విదారక ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ముంబై వచ్చిన ఓ వృద్ధుడు ఎయిర్లైన్స్ సిబ్బందిని ఓ వీల్చైర్ అడిగాడు. వీల్చైర్లకు భారీ డిమాండ్ ఉన్న కారణంగా ఆ వృద్ధుడిని కొద్దిసేపు వేచి ఉండాలని ఎయిర్లైన్స్ సిబ్బంది కోరారు.
దీంతో ఆలస్యమవుతుందని భావించిన ఆ వృద్ధుడు నడుస్తూ వెళ్లి ఇమిగ్రేషన్ చెక్ వద్ద గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఫిబ్రవరి 12న జరిగిన ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ‘వీల్ చైర్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున అవి అందుబాటులో లేవు. ఇందుకే 80 ఏళ్ల వృద్ధుడిని కొద్దిసేపే వేచి ఉండాలని మేం కోరాం. అయినా అతడు ఆయన భార్యతో కలిసి నడిచి వెళ్లాడు.
దురదృష్టవశాత్తూ అతడు ఇమిగ్రేషన్ చెక్ వద్ద గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించాం. అప్పటికే అతడు మరణించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే వీల్ చైర్ ఇవ్వాలని మా సంస్థకు ఒక పాలసీ ఉంది’ అని ఎయిర్లైన్స్ కంపెనీ ఎయిర్ ఇండియా తెలిపింది.