Delhi: 11 మంది సజీవ దహనం | 11 Died And 4 Injured In Fire Breaks Out At Alipur Main Market In Delhi Updates In Telugu - Sakshi
Sakshi News home page

Alipur Market Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం

Feb 16 2024 7:24 AM | Updated on Feb 16 2024 8:36 AM

Fire Breaks Out at Alipur Main Market in Delhi Updates - Sakshi

రద్దీ మార్కెట్‌ ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది. పేలుడు కారణంగా.. 

ఢిల్లీ, సాక్షి: దేశ రాజధాని ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. అలీపూర్‌లో ఓ పెయింట్‌ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి మంటలు చెలరేగగా.. పదకొండు మంది మృతి చెందారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ.. మరికొందరి ఆచూకీ లేకపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.

అలీపూర్‌ దయల్‌పూర్‌ మార్కెట్‌లో గురువారం సాయంత్రం ఓ పెయింట్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగగా.. అవి చుట్టుపక్కల ఇళ్లకు, దుకాణాలకు సైతం వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించారు. 

సాయంత్రం 5 గం. ప్రాంతంలో తమకు సమాచారం అందిందని.. రాత్రి 9గం. వరకు మంటలు అదుపులోకి వచ్చాయని ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ అధికారి ఒకరు తెలిపారు. మంటల్ని 22 ఫైరింజన్ల సాయంతో అతి కష్టం మీద అధికారులు అదుపు చేసినట్లు తెలిపారాయన. ఆపై కాలిన స్థితిలో పలు మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చినా.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 

పెయింట్‌ పరిశ్రమలో తొలుత పేలుడు సంభవించి.. మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలోని రసాయనాల వల్లే పేలుడు సంభవించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.  క్షతగాత్రుల్లో ఒక కానిస్టేబుల్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement