
రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటన
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. ముంబైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐసీటీ)కి రూ.151 కోట్ల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆయన 1970వ దశకంలో ఇక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అప్పట్లో ఈ విద్యాసంస్థను యూనివర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(యూడీసీటీ)గా పిలిచేవారు.
ముకేశ్ అంబానీ శుక్రవారం ఐసీటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పటి తమ ప్రొఫెసర్ శర్మ బోధించిన పాఠాలు, అందించిన స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. భారత ఆర్థిక సంస్కరణల రూపకల్పనలో ప్రొఫెసర్ శర్మ కీలక పాత్ర పోషించారని చెప్పారు. మన దేశం అన్ని రకాల సవాళ్లను అధిగమించి గ్లోబల్ లీడర్గా ఎదగాలని తన తండ్రి ధీరూబాయ్ అంబానీ తరహాలోనే ప్రొఫెసర్ శర్మ కూడా ఎంతగానో తపనపడ్డారని తెలిపారు.
ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా తోడైతే ఆర్థిక రంగంలో ఇండియా పరుగులు తీస్తుందని వారు విశ్వసించారని పేర్కొన్నారు. వారిద్దరూ గొప్ప దార్శనికులు అని కొనియాడారు. ప్రొఫెసర్ శర్మ కృషి వల్లే ఐసీటీ అత్యున్నత విద్యాసంస్థగా మారిందని చెప్పారు. ప్రొఫెసర్ శర్మను ‘భారత్ గురు’గా అభివర్ణించారు. ఆయనకు గురుదక్షిణగా ఐసీటీకి రూ.151 కోట్లు ఎలాంటి షరతులు లేకుండా ఇస్తున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. తన గురువు ప్రొఫెసర్ శర్మ సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్య నేరి్పన ఐసీటీకి పెద్ద మేలు చేయాలని చెప్పడంతో ఆయన ఆదేశాలను శిరసావహించినట్లు పేర్కొన్నారు.