మేధా పాట్కర్‌కు 5 నెలల జైలు | Medha Patkar sentenced to 5 months in prison in 23-year-old case | Sakshi
Sakshi News home page

మేధా పాట్కర్‌కు 5 నెలల జైలు

Jul 2 2024 5:26 AM | Updated on Jul 2 2024 5:26 AM

Medha Patkar sentenced to 5 months in prison in 23-year-old case

రూ.10 లక్షల జరిమానా 

వీకే సక్సేనా వేసిన పరువునష్టం కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు 

న్యూఢిల్లీ: సామాజిక వేత్త, నర్మదా బచావో ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు ఢిల్లీ కోర్టు సోమవారం ఐదు నెలల సాధారణ కారాగార శిక్ష విధించింది. గుజరాత్‌లోని ఒక ఎన్‌జీవోకు సారథి, ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా 23 ఏళ్ల క్రితం పాట్కర్‌పై వేసిన కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ గత నెల ఏడో తేదీన ఢిల్లీ మెట్రోపాలిటన్‌ మేజి్రస్టేట్‌ తీర్పు చెప్పారు. అయితే శిక్ష ఖరారును రిజర్వ్‌చేసి సోమవారం తీర్పును వెలువరించారు. 

పరువునష్టం కింద సక్సేనాకు రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని పాట్కర్‌ను కోర్టు ఆదేశించింది. తీర్పును పాట్కర్‌ పై కోర్టులో సవాల్‌ చేసుకునేందుకు అవకాశం కలి్పస్తూ నెలరోజులపాటు శిక్ష అమలును నిలిపివేస్తూ న్యాయమూర్తి రాఘవ్‌ శర్మ ఉత్తర్వులిచ్చారు. అయితే శిక్ష ప్రస్తుతానికి నిలుపుదల చేసిన నేపథ్యంలో తనకు బెయిల్‌ ఇవ్వాలని పాట్కర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. ఆనాడు సక్సేనాను పిరికిపంద అంటూ పాట్కర్‌ దూషించిన అంశం కోర్టులో రుజువుకావడంతో ఆమెను దోషిగా తేల్చారు. 

హవాలా లావాదేవీల్లో సక్సేనా హస్తముందంటూ పాట్కర్‌ చేసిన ఆరోపణల్లో నిజంలేదని, పాట్కర్‌ కారణంగా ఆయన పరువుకు నష్టం కలిగిందని కోర్టు అభిప్రాయపడిన విషయం విదితమే. 2000 సంవత్సరంలో అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేసే ‘కౌన్సిల్‌ ఫర్‌ సివిల్‌ లిబరీ్టస్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు వీకే సక్సేనా అధ్యక్షునిగా ఉండేవారు. తనకు, నర్మదా బచావో ఆందోళన్‌ ఉద్యమానికి వ్యతిరేకంగా సక్సేనా ప్రకటనలు ఇచ్చారని ఆయనపై పాట్కర్‌ తొలిసారిగా ఫిర్యాదుచేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement