ముంబైలో గురువారం భారీ వర్షాలు కురిశాయి. వర్షం మధ్య తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అంధేరి-సాకినాకా, జోగేశ్వరి ప్రాంతాలను కుర్లా, ఘాట్కోపర్తో కలిపే ఖైరానీ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అతడు మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నట్టు సమాచారం.
ఘటనాస్థలిలో అతడి గొడుగు, చెప్పులు కనిపించాయి. ముంబై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది సంయుక్తంగా గాలింపు చేపట్టారు. దాదాపు 2 గంటల తర్వాత అతడి మృతదేహాన్ని వెలికితీశారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్వహిస్తున్న మరమ్మతుల పనుల వల్ల మ్యాన్హోల్ మూత తెరిచి ఉంచారు. డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడీ మాట్లాడుతూ.. ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తూ సంబంధిత కాంట్రాక్టర్పై హత్య కేసు నమోదు చేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్టు చెప్పారు.
ఈ ఘటనకు 2 రోజుల ముందే ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో స్కూల్ బస్సుపై చెట్టు కూలి 11 ఏళ్ల బాలుడు మృతి చెందగా, మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆ ఘటనపై ప్రాథమిక విచారణలో నిర్లక్ష్యం బయటపడటంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఓ అధికారిని సస్పెండ్ చేసింది.
ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలు
గురువారం కూడా ముంబైలో భారీ వర్షం కొనసాగింది. దాదర్, పరేల్, హింద్మాతా, చార్కోప్, వర్లీ, గోరేగావ్, అంధేరి సహా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.
గురువారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల్లో తూర్పు శివారు ప్రాంతాల్లో సగటున 189 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర ప్రధాన ప్రాంతాల్లో 172 మిల్లీమీటర్లు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ముంబై జీవనాడిగా భావించే లోకల్ రైలు సర్వీసులపై కూడా వర్షం ప్రభావం పడినట్లు తెలుస్తోంది. పట్టాలపై నీరు చేరడంతో ఉదయం రైళ్లు 10 నుంచి 15 నిమిషాలు ఆలస్యంగా నడిచాయని ప్రయాణికులు తెలిపారు. అయితే రైల్వే అధికారులు మాత్రం రైలు సర్వీసులు ఎలాంటి అంతరాయం లేకుండా సాధారణంగానే నడుస్తున్నాయని వెల్లడించారు.


