ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై పర్యటన సందర్భంగా తీవ్ర కలకలం చెలరేగింది. ప్రధాని పాల్గొనాల్సిన కార్యక్రమంలో ఇద్దరు అగంతకులు చొరబడ్డారు. పీఎంవో అధికారులమంటూ అనుమానాస్పదంగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తుపాకితో పాటు ఫేక్ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వేదికగా ‘గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026’ సదస్సు జరగాల్సి ఉంది. ఈ సదస్సును ప్రారంభించేందుకు ప్రధాని మోదీ రావాల్సి ఉంది. అంతకంటే ముందే రోహన్ పరేఖ్ తాను ప్రధాన మంత్రి కార్యాలయ అధికారినంటూ ఆ ఈవెంట్కు వచ్చారు. తనిఖీల్లో భాగంగా అతని వద్ద నకిలీ పీఎంవో ఐడీ కార్డుతో పాటు తుపాకీ లభించడంతో భద్రతా బలగాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అతనితో పాటు ఉన్న సెక్యూరిటీ గార్డును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన తీవ్రత దృష్ట్యా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల మొబైల్ ఫోన్లు, గుర్తింపు పత్రాలను పరిశీలిస్తున్నారు.తుపాకులతో, నకిలీ ఐడీలతో నేరుగా ప్రధాని మోదీ హాజరు కావాల్సిన కార్యక్రమానికి ఎందుకు వచ్చారనే అంశంపై లోతుగా విచారణ జరుపుతున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక ఫిన్టెక్ సదస్సులలో ఒకటైన ‘గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026’ను ముంబైలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన వేళ జరిగిన ఈ భద్రతా లోపం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.


