సోమవారం స్పీకర్ను కోరుతామన్న రెబల్ ఎంపీలు
ఫిరాయింపుల చట్టం తమకు వర్తించదని వాదన
ఆన్లైన్లో 19 మంది ఎంపీల సంతకాలున్న లేఖ
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అంతర్గత సంక్షోభం కీలక మలుపులు తిరుగుతోంది. రెబల్ వర్గం తమదే అసలైన టీఎంసీ అంటోంది. లోక్సభలో టీఎంసీకి ఉన్న 28 మంది సభ్యులకుగాను 19 మంది తమ పక్షానే ఉన్నారని ప్రకటించింది. సోమవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమ వర్గాన్నే అసలైన టీఎంసీగా గుర్తించాలని కోరుతామంది. మమతా బెనర్జీ వర్గం చెబుతున్నట్లుగా తమకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని తెలిపింది.
తిరుగుబాటు వర్గం ఎంపీ జగదీశ్ చంద్ర బర్మ బసూనియా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తమ వర్గాన్ని అసలైన టీఎంసీ పార్లమెంటరీ గ్రూపుగా గుర్తించాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు ఇప్పటికే వినతి పత్రం అందజేశాం. మా పక్షం ఎంపీల సంతకాల సేకరణ ఈ నెల 8వ తేదీన మొదలుపెట్టాం. ఇప్పటి వరకు 19 మంది ఎంపీల సంతకాలను సేకరించాం. స్పీకర్ను సోమవారం మళ్లీ కలిసి, ఇందుకు సంబంధించిన వివరాలను అందజేస్తాం’అని వివరించారు.
కాగా, తిరుగుబాటు వర్గం ఎంపీల పేర్లు, వారు సంతకాలు చేసినట్లుగా చెబుతున్న లేఖ ఒకటి ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. కాకోలీ ఘోష్ దస్తీదార్ సారథ్యంలో తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు తాము మద్దతు తెలుపుతున్నట్లు అందులో ఉంది.
ఎంపీలు కాకోలీ ఘోష్ దస్తీదార్, శతాబ్ది రాయ్, బాపి హల్దార్, శర్మిలా సర్కార్, ప్రసూన్ బందోపాధ్యాయ్, జగదీశ్ బర్మ బసూనియా, అసిత్ కుమార్ మల్, అరూప్ చక్రవర్తి, రచనా బెనర్జీ, సాయోని ఘోష్, ఖలీలుర్ రహమాన్, అబు తహెర్ఖాన్, యూసఫ్ పఠాన్, మితాలీ బాగ్, మాలా రాయ్, కాలిపాద సోరెన్, దీపక్ అధికారి, జూన్ మాలియా, పార్థ భౌమిక్ల సంతకాలు అందులో ఉన్నాయి. వీరితోపాటు మరికొందరు తమ గ్రూపులో చేరే అవకాశముందని ఈ వర్గానికి చెందిన ఓ ఎంపీ తెలిపారు. వీరంతా త్వరలో ఢిల్లీలో కలుసుకుని, తమ కార్యాచరణను ఖరారు చేసుకుంటారని చెబుతున్నారు.
ఆపరేషన్ లోటస్లో భాగం: కీర్తి ఆజాద్
పార్టీలో అసమ్మతి జ్వాలల నేపథ్యంలో టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆపరేషన్ లోటస్ చేపట్టిన బీజేపీ తమ పార్టీలో ఫిరాయింపులకు చేస్తున్న కుట్రలు ఫలించవన్నారు. ఈ కుట్రల వెనుక హోం మంత్రి అమిత్ షా ఉన్నారంటూ ఎక్స్లో విమర్శలు చేశారు. పథకం ప్రకారమే బీజేపీ ఇదంతా చేస్తోందన్నారు. అయితే, గురువారం సీనియర్ నేత కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఉండాలో, తానుండాలో తేల్చుకోవాలంటూ మమతా బెనర్జీకి ఆయన అల్టీమేటం ఇవ్వడం తెల్సిందే. దీనిపై కీర్తి ఆజాద్.. ‘కల్యాణ్ బెనర్జీ ఎదో ఉద్రేకంతో అలా మాట్లాడారే తప్ప, ఆయన మమతా బెనర్జీ వీడి ఎక్కడికీ వెళ్లరు’అంటూ చెప్పుకొచ్చారు.
మూడో అతిపెద్ద ప్రతిపక్షం
లోక్సభలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల తర్వాత టీఎంసీకి అత్యధికంగా 28 మంది ఎంపీల బలముంది. వీరిలో 19 మంది వేరుకుంపటి ప్రకటించుకున్నారు. మూడింట రెండొంతుల మంది ఉన్నందున తమకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదన్నది వీరి వాదన. ఈ సంఖ్యను అధికారికంగా ఆమోదించిన పక్షంలో వీరికి చట్టపరమైన రక్షణ కల్పించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇలా ఉండగా, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల గెలిచిన 80 మంది ఎమ్మెల్యేలకుగాను 58 మంది తిరుగుబాటు ప్రకటించిన రితబ్రత బెనర్జీకి మద్దతు ప్రకటించారు. పార్టీలో అన్ని స్థాయిల్లోనూ ఇదే రకమైన అసమ్మతి కన్పిస్తుండటంతో మమతా బెనర్జీ పార్టీ కమిటీలన్నిటినీ రద్దు చేయడం తెల్సిందే.
వాళ్లంతా ద్రోహులు: మహువా మొయిత్రా
జగదీశ్ చంద్ర బర్మ బసునీ ప్రకటనపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు. తిరుగుబాటు వర్గం వాదనల్లో ఎలాంటి పస లేదన్నారు. ‘ఆ ద్రోహులకు చట్టం గురించి తెలియదు. 2003 నాటి రాజ్యాంగ 91వ సవరణ ద్వారా పార్టీలో చీలిక లేదా ప్రత్యేక వర్గంగా ఏర్పడే నిబంధనను పూర్తిగా తొలగించారు. ఇక్కడ ఎంతమంది ఎంపీలు ఉన్నారనే సంఖ్యతో సంబంధం లేదు. అసలైన రాజకీయ పార్టీలోని మూడింట రెండు వంతుల మంది ప్రజాప్రతినిధులు వేరే పార్టీలో విలీనం కావాల్సిందే. ఆ 19 మంది ద్రోహులూ వెంటనే రాజీనామా చేసి, బీజేపీ టికెట్పై మళ్లీ పోటీ చేయాలి’అంటూ ఆమె ఎక్స్లో నిప్పులు చెరిగారు.


