
నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్కు మదురై కోర్టులో ఊరట లభించింది. కమలహాసన్ 2017లో ఒక టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహాభారతం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అంతేకాకుండా కమల్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నెల్లై జిల్లా పళైయూర్ గ్రామానికి చెందిన ఆదినాథ సుందరం అనే వ్యక్తి వల్లియూర్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో ఆ పిటిషన్ను కొట్టి వేయాల్సిందిగా నటుడు కమలహాసన్ తరఫున మదురై హైకోర్టులో దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణలో ఉంది. కాగా శుక్రవారం మరోసారి ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో నటుడు కమలహాసన్ తరఫు న్యాయవాది హాజరై ఇలాంటి వివాదాస్పద సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన మాటలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కమలహాసన్పై కేసును కొట్టి వేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: 'నేను పార్టీ మారానా.. దమ్ముంటే నిరూపించండి'