నదులకు లాలపోసే తల్లులు! | International Day of Action for Rivers on March 14: Over a 1000 women from 21 villages of a revenue block in Vellore district | Sakshi
Sakshi News home page

నదులకు లాలపోసే తల్లులు!

Mar 14 2026 1:14 AM | Updated on Mar 14 2026 1:14 AM

International Day of Action for Rivers on March 14: Over a 1000 women from 21 villages of a revenue block in Vellore district

సందర్భం ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యాక్షన్‌ ఫర్‌ రివర్స్‌

ప్రాణం పోసే శక్తి స్వరూపిణి స్త్రీ. మనుషులకే కాదు దైవసమానమైన నదులకు కూడా ప్రాణం పోస్తోంది ఆ శక్తి. జీవం కోల్పోయి, మృత్యుదిబ్బలుగా మారిన ఎన్నో నదులకు దేశవ్యాప్తంగా ప్రాణం పోస్తున్నారు మహిళలు. సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నారు...

తమిళనాడులోని వెల్లూరు, తిరువణ్ణామలై జిల్లాల గుండా ప్రవహించే పాలార్‌ నది ఉపనది నాగనది పూర్వవైభవం కోల్పోయింది. ఎండిపోయి నిర్జీవంగా మారింది. వర్షాలు పడినా సరే ఆ మృత నదిలో నీటి గలగలలు లేవు. ఈ నది ఎండి పోవడం పంట పొలాలపై, అక్కడి ప్రజల ఉపాధిపై ప్రభావం చూపింది. ఎంతోమంది  పొట్ట చేతపట్టుకొని పట్టణాల బాట పట్టారు.

ఈ నేపథ్యంలో నదిని పునర్జీవింపజేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయింది. ఈ కార్యక్రమంలో మహిళలు క్రియాశీల పాత్ర పోషించడం విశేషం. వెయ్యిమంది మహిళలు సంవత్సరం పాటు 21 గ్రామ పంచాయతీలలో రీఛార్జ్‌ బావులు, రెండు వందల బౌల్డర్‌ చెక్‌లను నిర్మించారు. బౌల్డర్‌ చెక్‌లతో నీటి ప్రవాహాన్ని నెమ్మదింపజేయడానికి, నీటి కోతను నివారించడానికి, భూగర్బ జల మట్టాలను పెంచడానికి ఎంతో కష్టపడ్డారు.

వారి శ్రమ ఫలించింది
భూగర్భ జలాలు పెరిగాయి. అవి నాగనదిలోకి వెళ్లాయి. నది మెల్లగా ప్రాణం పోసుకోడం మొదలైంది. ఈ వార్త తెలిసిన మరింతమంది మహిళలు నాగనది పునర్జీవనోద్యమంలో భాగం అయ్యారు.

ఇప్పుడు..
నాగనది ఏడాది  పొడవునా ప్రవహిస్తోంది. ఈ సజీవ ప్రవాహం ఈ ప్రాంతంలోని సామాజిక, ఆర్థిక దృశ్యాన్ని మార్చివేసింది. వ్యవసాయం తిరిగి మొదలైంది. తమిళనాడులోని పదిహేను జిల్లాలలో ఇరవై అయిదు నదులను పునర్జీవింప చేయడానికి నాగనది స్ఫూర్తిగా మారింది.

కోసీ నది కోసం...
అటవీ నిర్మూలన పెరగడం వల్ల కోసీ నది ప్రమాదంలో ఉందని గ్రహించిన సామాజిక కార్యకర్త బసంతిదేవి బాధపడడానికి మాత్రమే పరిమితం కాలేదు. తన బాధ్యతగా గట్టిపని ఏదైనా చేయాలని అనుకుంది. నదితోపాటు సమీపంలోని అడవులను కాపాడాలని నిర్ణయించుకుంది.

‘నదిని రక్షించుకుందాం’ అనే నినాదంతో ఉద్యమంలో మహిళలను భాగం చేయడానికి ఊరూ వాడా తిరిగింది ఉత్తరాఖండ్‌కు చెందిన బసంతి. ఎన్నో సంవత్సరాలు అలుపెరుగని కృషి చేసింది. వందలాది మంది మహిళలను కోసి నది పరిరక్షణ ఉద్యమంలో భాగం చేసింది. వందలాది గ్రామ మహిళలు చెట్లను రక్షించడానికి, మొక్కలను నాటడానికి, నదిని కాపాడుకోవడానికి నడుం కట్టారు.

ప్రతి గ్రామంలో ఏర్పడిన మహిళా సంఘాల సమష్టి కృషి ద్వారా అడవుల నరికివేత ఆగిపోయింది. మొక్కలు చెట్లు అయ్యాయి. కోసి నది ప్రాంతంలో ఎండిపోయిన ప్రదేశాలలో నీరు సమృద్ధిగా దొరకడం మొదలైంది. నీటి ఊటలు పునర్జీవనం  పొందాయి. దీంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.

‘సేవ్‌ కోసీ ఉద్యమం’ నేటికీ కొనసాగుతుండడం విశేషం.
‘మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజులలో చాలా సందేహాలు ఉండేవి. అయితే ఉద్యమకారులకు సంకల్పబలం తప్ప సందేహాలు ఉండకూడదు అనే మాట మాకు చాలా బలాన్ని ఇచ్చింది. ఉద్యమాన్ని విజయవంతం చేసింది’ అంటుంది ఉత్తరాఖండ్‌లోని చోప్రియాలి గ్రామానికి చెందిన భువనేశ్వరీ. ఆమె ‘మహిళా మంగళ్‌ దళ్‌’ సభ్యురాలు.

నదుల నేస్తం... నీతా పటేల్‌
గుజరాత్‌లోని వెనకబడిన జిల్లాలలో డాంగ్‌ ఒకటి. ఈ జిల్లాలోని గిరిజన గ్రామాలను సందర్శిస్తున్న క్రమంలో నర్మదా, బహ్రూచ్‌ కొండ ప్రాంతాల్లో జూన్‌ అక్టోబర్‌ మాసాల మధ్య సమృద్ధిగా వర్షాలు కురిసిన్పటికీ ఆ ప్రాంతాలలో పచ్చదనం లేకపోవడాన్ని గమనించింది నీతా పటేల్‌. గ్రామస్తులు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది పటేల్‌.

గ్రామాలు తిరుగుతూ ఎంతోమందిని సమీకరించింది. వందలాదిమందితో వేలాది మొక్కలు నాటించింది. డాంగ్‌ జిల్లాలో ప్రవహించే పూర్ణ, ఖాప్రి, అంబికా, గిరా, దోధాద్‌ నదులపై ఎన్నో చెక్‌ డ్యామ్‌లు, గ్రూప్‌ వెల్స్, చెక్‌ వాల్స్, బోరీ బంద్‌లు (ఇసుక నిండిని సంచుల) ఏర్పాటు చేసింది. ఎన్నో గ్రామాలలో మహిళలతో నీటి సంఘాలు ఏర్పాటు  చేయించింది. సౌరశక్తితో నడిచే నీటిపారుదల వ్యవస్థలను నీతా అభివృద్ధి చేసింది. దీనివల్ల వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. ‘నది పరిరక్షణ ఉద్యమంలో విజయం సాధించడానికి ఈ ఉద్యమంలో భాగమైన ఎంతోమంది గిరిజన మహిళలు కారణం’ అంటుంది నీతా పటేల్‌.

...వీరు మాత్రమే కాదు జయశ్రీ వెంకటేశన్‌(తమిళనాడు), గౌరీ మిరాషి (కామ్‌ నది, ఔరంగాబాద్‌), కిరణ్‌ కౌర్‌ (బహ్మపుత్ర/వారద బేసిన్, అస్సాం), శాంతిరాయ్‌ (తీస్తా నది, పశ్చిమ బెంగాల్‌), జల్‌ సహేలి (ఉత్తర్‌ప్రదేశ్‌)... ఎంతో మంది వాటర్‌ ఛాంపియన్‌లు మృత్యుశయ్యపై ఉన్న నదులకు జీవం పోస్తున్నారు. నదుల కళ్లలో కొత్త వెలుగు తీసుకు వస్తున్నారు.

సేవ్‌ గంగోత్రి
పర్వతారోహకురాలు అయిన డాక్టర్‌ హర్షవంతి ‘సేవ్‌ గంగోత్రి’ ప్రాజెక్ట్‌తో ఎంతోమందిలో అవగాహన కలిగిస్తోంది. భోజ్‌ అడవిని పునరుద్ధరించే పని చేపట్టింది. వేలాది మొక్కలు నాటించింది. ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి ప్రాంతంలో ప్రధాన జల వనరుల దగ్గర పరిస్థితులను మెరుగు పరచడానికి విశేష కృషి చేసింది. నదుల రక్షణ, పర్యావరణంపై అవగాహన కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. ‘మహిళా శక్తితో ఎన్ని విజయాలు అయినా సాధించవచ్చు’ అంటుంది హర్షవంతి.

మన నదులు మన భవిష్యత్‌
విధ్వంసక నీటి అభివృద్ధి ప్రాజెక్ట్‌లను (పెద్ద డామ్‌లు) వ్యతిరేకించడానికి, నదులకు జీవం పోసి కాపాడుకోవడానికి నదుల పరిరక్షణ దినం మొదలైంది. ఈ సంత్సరం థీమ్‌: మన నదులు–మన భవిష్యత్‌. నదీ పర్యావరణ వ్యవస్థలను రక్షించడం, పునరుద్ధరించడం లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఎన్నో సమావేశాలు, సదస్సులు, నదులను శుభ్రపరిచే కార్యక్రమాలు జరుగుతాయి, బ్రెజిల్‌లోని కురిటిబాలో 1997లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో నదుల పరిరక్షణ దినోత్సవానికి బీజం పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement