
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీలో చోటు చేసుకున్న అశాంతి విషయంలో కోల్కతా హైకోర్టు సీరియస్ అయింది. సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన కేసును మంగళవారం కోల్కతా హైకోర్టు విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా సందేశ్కాలీ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షాజాహాన్ షేక్ పరారీలోనే ఉండటానికి వీలులేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన్ను సమర్థించకూడదని పేర్కొంది. సందేశ్ఖాలీని సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని బీజేపీ నేత సువేందు అధికారి అభ్యర్థించారు. ఆయన విజ్ఞప్తిపై ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం స్పదించారు. సందేశ్కాళీ ప్రాంతంలోని మహిళలు చేసిన ఆరోపణలను హైకోర్టు గుర్తించిందని తెలిపారు.
‘మేము అక్కడి మహిళలకు సంబంధించి బాధలను చూశాం. ఆ ప్రాంతంలోని మహిళలు సమస్యలపై నిరసన తెలిపారు. అక్కడ కొంత భూమి ఆక్రమణకు గురైంది. ఈ కేసులో ప్రాథమికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షాజాహాన్ షేక్ పరారీలోనే ఉండటానికి వీలులేదు. రాష్ట్రం ప్రభుత్వం కూడా విషయాన్ని సమర్ధించదు. ఆయన లొంగిపోవాలి. ఆయన చట్టాన్ని ధిక్కరించడం సాధ్యం కాదు’అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
‘నేరాలకు పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఆయన రక్షించబడుతున్నాడో? లేదో? మాకు తెలియదు. రాష్ట్ర పోలీసులు మాత్రం పలు ఘటనల్లో కీలకంగా ఉన్న షాజాహాన్ షేక్ను అరెస్ట్ చేయలేకపోయారు’ అని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
చదవండి: Sandeshkhali: సువేందు అధికారిని మరోసారి అడ్డుకున్న పోలీసులు