
ఇప్పటికే ముగ్గురి భర్తలను మార్చిన మహిళ
నాలుగో భర్తతో వివాహమైన మరుసటి రోజే ఉడాయింపు
అప్పటికే నగలు, నగదు సమర్పయామి
కర్ణాటక: ప్రేమ పెళ్లి పేరుతో యువకుల జీవితాలతో ఓ మహిళ చెలగాటమాడింది. డబ్బున్న వారిని గుర్తించి వలపు వల విసిరి పెళ్లి చేసుకొని నగదు, నగలతో ఉడాయిస్తోంది. ఇప్పటికే ముగ్గురు భర్తలను వదిలేసిన ఆమె తాజాగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మరుసటి రోజే నగలతో ఉడాయించింది. బాధిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమె నిత్య పెళ్లికూతురని తెలిసి అవాక్కయ్యాడు. మండ్య జిల్లా మద్దూరు తాలూకా కెస్తూరు గ్రామానికి చెందిన పుట్టస్వామి కుమార్తె కే.పి. వైష్ణవి, ఇదే తాలూకా మల్లనాయకనకట్టె గ్రామానికి చెందిన ఎం.బి.శశికాంత్ 8 నెలలుగా ప్రేమించుకున్నారు.
తాము చాల పేదమని భర్త వద్ద వాపోయిన వైష్ణవి పెళ్లికి ముందే రూ.లక్ష తీసుకుంది. అనంతరం పెళ్లినగలంటూ అతనితోనే వంద గ్రాముల బంగారం కొనుగోలు చేయించింది. కాబోయే భార్యకు శశికాంత్ రూ. 6లక్షల నగదను ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. మామకు ఆటో ఇప్పించాడు. ఇంటి అడ్వాన్సు కోసం రూ. 50 వేలు, అత్తకు పాత చైన్ను తీసుకొని 46 గ్రాములతో కొత్త చైన్ ఇప్పించాడు ఫ్రిడ్జి, టీవీ, వాషింగ్మెషిన్, అందరికి మొబైల్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయిచి ఇచ్చాడు. శశికాంత్, వైష్ణవికి మార్చి 24న ఆదిచుంచనగిరి క్ష్రేత్రంలో వివామైంది.
మరుసటి రోజు కొత్త దంపతులు గౌడగెరె చాముండేశ్వరి ఆలయానికి కారులో బయల్దేరారు. ఉమ్మడిహళ్లి గెట్ వద్ద వాటర్ బాటిల్ కోసం శశికాంత్ కారు దిగాడు. అప్పటికే పథకం ప్రకారం వెనకాల వచ్చిన కారులో వైష్ణవి ఎక్కి ఉడాయించింది. బాటిల్ తీసుకొని కారు వద్దకు రాగా వైష్ణవి కనిపించలేదు. దీంతో శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెకు ఇప్పటికే మూడు వివాహాలు అయినట్లు పోలీసులు తెలిపారు. ధర్మస్థలలో హాసన్కు చెందిని రఘు అనే వ్యక్తితో, అనంతరం శివ అలియాస్ తుపాకీ శివుతో ఇలా ముగ్గురితో వివాహమైందని, వారి ఇళ్ల నుంచి నగలతో ఉడాయించినట్లు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.