మమత పార్టీలో మంటలు | Kakoli Dastidar and 20 MPs Will Support NDA | Sakshi
Sakshi News home page

మమత పార్టీలో మంటలు

Jun 9 2026 5:02 AM | Updated on Jun 9 2026 5:02 AM

Kakoli Dastidar and 20 MPs Will Support NDA

ఎన్డీయేకు జైకొట్టిన 20 మంది టీఎంసీ ఎంపీలు  

లోక్‌సభలో బీజేపీ కూటమికి మద్దతిస్తున్నట్లు ప్రకటన  

స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ 

టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి సుఖేంద్‌ శేఖర్‌ రే రాజీనామా  

సాక్షి, న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో తిరుగుబాటు సంక్షోభం మరింత ముదిరింది. ఇప్పటికే పార్టీలో 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేసి పార్టీ చీఫ్‌ మమతా బెనర్జీపై ధిక్కార స్వరం విన్పించగా సోమవారం ఏకంగా 20 మంది ఎంపీలు సైతం పార్లమెంట్‌ వేదికగా ఎన్‌డీఏ కూటమికి మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారు. 

విపక్షాల ‘ఇండియా’ కూటమి భేటీ కోసం మమత ఢిల్లీలో ఉండగానే టీఎంసీ అసమ్మతి ఎంపీలు ఈ తిరుగుబాటు జెండా ఎగరేసి పార్టీని మరింత సంక్షోభ సుడిగుండంలోకి నెట్టేశారు. ఎన్డీయేకు తమ మద్దతు ప్రకటిస్తూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు సోమవారం లేఖ రాశారు. పార్టీ చీఫ్‌ విప్‌ కకోలీ ఘోష్‌ దస్తీదార్‌ నాయకత్వంలో తిరుగుబాటు ఎంపీలు ఏకమయ్యారు. ‘‘నాతో కలిపి 20 మంది పార్టీ ఎంపీలు బెంగాల్‌ అభివృద్ధి కోసం ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.

 మా నిర్ణయాని్న తెలుపుతూ స్పీకర్‌ బిర్లాకు ఇప్పటికే లేఖ రాశాం. మమ్మల్ని చీలికవర్గంగా గుర్తించాలని పేర్కొంటూ లోక్‌సభలో మాకు విడిగా సీటింగ్‌ కేటాయించాలని  లేఖలో విన్నవించుకున్నాం’’ అని నాయకురాలు కకోలీ దస్తీదార్‌ తెలిపారు. అయితే చీఫ్‌ విప్‌ పదవి నుంచి కకోలీని గతంలోనే తప్పించామని, పార్టీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీని ఆ పదవిలో నియమించామని పేర్కొంటూ మే 20న స్పీకర్‌కు మమత రాసిన లేఖను టీఎంసీ పార్టీ సోమవారం బయటపెట్టింది. కకోలీ ప్రస్తుతం పార్టీలో ఏ పదవిలోనూ లేరు అని టీఎంసీ స్పష్టం చేసింది.   

ఇక ఎన్డీయేతో ప్రయాణం: దస్తీదార్‌  
లోక్‌సభలో టీఎంసీ చీఫ్‌ విప్‌గా తమ నాయకురాలు కకోలీ ఘోష్‌ దస్తీదార్‌ను కొనసాగించాలని రెబల్‌ ఎంపీలు స్పీకర్‌ ఓం బిర్లాను కోరబోతున్నట్లు తెలిసింది. మేము ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాం. మా భవిష్యత్‌ రాజకీయ ప్రయాణం ఎన్డీయేతో సాగాలని భావిస్తున్నామని తిరుగుబాటు ఎంపీలు తెలిపారు. లోక్‌సభ సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేసి, బీజేపీలో చేరాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదని ఎంపీలు స్పష్టంచేశారు. లోక్‌సభలో ఎన్డీయేకు మద్దతిస్తూ ప్రత్యేక పార్లమెంటరీ వర్గంగా కొనసాగుతామని చెప్పారు. లోక్‌సభలో టీఎంసీకి ప్రస్తుతం 28 మంది ఎంపీలు ఉన్నారు. మూడింట రెండొంతుల మంది తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 

దీంతో వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు పడే అవకాశం లేదని తెలుస్తోంది. అసమ్మతి ఎంపీలు ఢిల్లీలో పార్టీ నాయకురాలు శతాబ్దిరాయ్‌ నివాసంలో బెంగాల్‌ బీజేపీ సీనియర్‌ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారితో సమావేశమయ్యారు. బీజేపీ నేతలతో 12 మంది టీఎంసీ ఎంపీలు సమావేశమయ్యారని టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్‌ వెల్లడించారు. టీఎంసీ ఎంపీలు కకోలీ ఘోష్, శతాబ్ది రాయ్, అబూ తాహిర్‌ ఖాన్, అరూప్‌ చక్రవర్తి, ఖలీలుర్‌ రహమాన్, షర్మిల సర్కార్, రచనా బెనర్జీ, అసిత్‌  మల్, జగదీశ్‌ చంద్ర వర్మ బాసునీయ, కాలిపద సోరెన్, ప్రసూన్‌ బెనర్జీ, పార్థ బౌమిక్‌లు బీజేపీ నేతలతో భేటీ అయినట్లు కథనాలొచ్చాయి. 

రితబ్రత బెనర్జీతో ఫిర్హాద్‌ హకీం భేటీ  
మమతా బెనర్జీకి సన్నిహితుడైన టీఎంసీ సీనియర్‌ నాయకుడు, కోల్‌కతా మాజీ మేయర్‌ ఫిర్హాద్‌ హకీం సోమవారం బెంగాల్‌ అసెంబ్లీ ప్రాంగణంలో తిరుగుబాటు ఎమ్మెల్యేల నేత రితబ్రత బెనర్జీతో ఆయన చాంబర్‌లో సమావేశమయ్యారు. మరో తిరుగుబాటు ఎమ్మెల్యే సాందీపన్‌ సాహా సైతం హకీం వెంట వచ్చారు. ఇటీవలే మేయర్‌ పదవికి రాజీనామా చేసిన హకీం.. తిరుగుబాటు వర్గంతో సమావేశంకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈయన మమత తరఫున మధ్యవర్తిత్వం కోసం వచ్చారా?  అనేది తెలియాల్సి ఉంది.   

కలకత్తా హైకోర్టులో టీఎంసీ పిటిషన్‌   
తిరుగుబాటు వర్గం నాయకుడు రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తూ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని టీఎంసీ వ్యతిరేకించింది. స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సోమవారం కలకత్తా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని, అందుకే ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని టీఎంసీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. 11న ఈ పిటిషన్‌ను విచారిస్తామని జస్టిస్‌ కృష్ణారావు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement