ఇదే నా రాజకీయ ఉద్యమ నినాదం
నేటి నుంచి సరికొత్త రాజకీయయాత్ర ఆరంభిస్తున్నా
తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై ప్రకటన
పార్టీకి గుడ్బై; రాజీనామా ఆమోదం
సాక్షి, చెన్నై: తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై శుక్రవారం తన సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. ‘మారుదాం... మార్చుదాం’అనే నినాదంతో ఇకపై నూతన రాజకీయయాత్రను ఆరంభిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. బీజేపీ నుంచి వైదొలగాలన్న తన నిర్ణయాన్ని పార్టీ అధిష్టానం ఒప్పుకుందని, తన రాజీనామాను బీజేపీ అగ్రనాయకత్వం శుక్రవారం అంగీకరించిందని అన్నామలై వెల్లడించారు.
తన రాజీనామా, కొత్త రాజకీయ ఉద్యమాల వివరాలను ఫేస్బుక్ లైవ్స్ట్రీమింగ్ ద్వారా అన్నామలై వెల్లడించారు. ‘‘నా మార్గం వేరు. నా లక్ష్యాలు చాలా పెద్దవి. రాష్ట్రంలో ఒక సరికొత్త రాజకీయ సంస్కృతిని, సమున్నతమైన మార్పును తీసుకురావాలన్నదే నా ఆశయం. రాష్ట్రంలో కొత్త రాజకీయ ఉద్యమం అత్యావశ్యకమైంది. ఇది పేరుకు సంబంధించినది కాదు ఒక ఆలోచనకు సంబంధించినది.
మనల్ని మనం ముందుకుగా మార్చుకుందాం. తర్వాత సమాజంలో మార్పు దానంతట అదే వస్తుంది. మన ఉద్యమానికి పునాది మనం మారుదాం. అంతా మార్చేద్దాం. ఫక్తు రాజకీయాలను మనం తుదముట్టిద్దాం. సామాన్యుడి రాజకీయాలు చేద్దాం. ప్రజావసరాలే మనకు పరమావధిగా ఉండాలి. ఇప్పుడున్న రాజకీయ పార్టీలతో మనకు పోటీలేదు. ఎవరితోనూ పోటీపడేందుకు మనం లేం. అధికార పార్టీని, విపక్షాలను వాళ్ల రాజకీయాలు వాళ్లను చేసుకోనిద్దాం.
మన సమయం వచ్చినప్పుడు మనం రాజకీయాలు చేద్దాం. మొదట రాజకీయ ఉద్యమాన్ని మొదలెడదాం. ఇందులో ఆసక్తి ఉన్నవాళ్లు wetheleader. org పోర్టల్ ద్వారా వలంటీర్లుగా సభ్యత్వం తీసుకోండి. మీకు రాజకీయాలు నేరి్పస్తా. త్వరలో కోయంబత్తూర్లో ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ సంస్థను ఆరంభించి శిక్షణనిస్తా. నేటి నుంచి కొత్త పథం. కొత్త ఉద్యమం. కొత్త రాజకీయపోరాటం’’అని వ్యాఖ్యానించారు. wetheleader. org పోర్టల్కు అనూహ్య స్పందన మొదలైంది. గంటల వ్యవధిలోనే 10లక్షలకుపైగా సభ్యత్వం తీసుకోవడం విశేషం.
మనకు అన్ని పార్టీలూ ఒక్కటే..
‘‘వ్యతిరేకించడం మన రాజకీయ వైఖరి కాదు. డీఎంకే, అన్నాడీఎంకే, ఎన్టీకే, సీమన్, పీఎంకే నేత అన్బుమణి, టీఎంసీ మూపనార్ జీకే వాసన్, ఏసీ షణ్ముగం, పారివేంద్రన్, జాన్ పాండియన్, కృష్ణస్వామి, వైగో, ప్రేమలతలను ఎలాగైతే ఇప్పుడు వ్యతిరేకిస్తానో ఇకపై బీజేపీనీ అలాగే వ్యతిరేకిస్తా. పార్టీని వీడేటప్పుడు తమిళనాడు పద్ధతి ప్రకారం గౌరవప్రదంగా కలిసి వివరించి బీజేపీ నుంచి ని్రష్కమించా. కేంద్ర మంత్రి అమిత్ షా సహా అగ్రనేతలను కలిసి పార్టీ వీడుతున్నట్లు స్పష్టంగా చెప్పా. 18 నెలల క్రితమే 2024 డిసెంబర్ 4న పార్టీకి తొలిసారి వివరించా. వద్దు అని వారించారు. మే చివరిదాకా రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల బాధ్యతలు చూసుకోవాలని నన్ను ఆపేశారు. తమిళునిగా కొనసాగుతూ బీజేపీ నేతగా ఉండటం కష్టమైన పని’’అని అన్నారు.
ఉక్కు వ్యవస్థను తీసుకొస్తా
‘‘పార్టీని పటిష్టమైన ఉక్కులాంటి వ్యవస్థను తీర్చిదిద్దుతా. ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం మొదలు 30,000 స్థానిక సంస్థల్లోని ప్రతినిధుల దాకా ప్రతి ఒక్కరికీ పదవీకాలంపై పరిమితి విధిస్తా. ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నిసార్లు పోటీచేయొచ్చనే దానిపై పరిమితి తీసుకొస్తా. ఉద్యమం విజయవంతమయ్యాక రాజకీయ పార్టీగా మారి రాజకీయ ప్రస్థానం ఆరంభిస్తా. అధికార కుర్చీ ఎవరికీ శాశ్వతంకాదు. చివరకు నాక్కూడా. భారతీయునిగా కొనసాగుతూ తమిళుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తా. నా అభిమానులు, వారియర్లు ఆన్లైన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లే పనులు పెట్టుకోకండి. హద్దు మీరు వివాదాస్పద వ్యాఖ్యలు ఆన్లైన్లో చేయకండి’’అని అన్నామలై తన మద్దతుదారులకు సూచించారు.
మాకు ఎలాంటి నష్టంలేదు
బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్
అన్నామలై ని్రష్కమణతో పార్టీకి ఎలాంటి నష్టంలేదని బీజేపీ తమిళనాడు చీఫ్ నైనార్ నాగేంద్రన్ అన్నారు. ‘‘ఆయన రాజీనామాచేసినా పార్టీకి ఎలాంటి నష్టంలేదు. బీజేపీ ఏ విధంగానూ ఇబ్బందిపడబోదు. బీజేపీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ. సిద్ధాంతంపరంగా పార్టీ దృఢంగా ముందుకుసాగుతుంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు’’అని అన్నారు. బీజేపీ నుంచి అన్నామలై వెళ్లిపోవడాన్ని ఎండీఎంకే చీఫ్ దురై వైగో, కాంగ్రెస్ నేతలు, వీసీకే చీఫ్ థోల్ తిరుమావళవన్ స్వాగతించారు.


