జేఈఈ వెబ్‌సైట్‌లో సెక్యూరిటీ బ్లండర్.. ఐఐటీ రూర్కీకి చెమటలు | JEE Advanced Website Flaw 16 Year-Old Flags Mega Data Leak IIT Roorkee Acts | Sakshi
Sakshi News home page

జేఈఈ వెబ్‌సైట్‌లో సెక్యూరిటీ బ్లండర్.. ఐఐటీ రూర్కీకి చెమటలు

Jun 3 2026 9:59 AM | Updated on Jun 3 2026 10:14 AM

JEE Advanced Website Flaw 16 Year-Old Flags Mega Data Leak IIT Roorkee Acts

న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల వెబ్‌సైట్‌లో ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్ష వెబ్‌సైట్‌లోని ఒక భారీ సాంకేతిక భద్రతా లోపాన్ని (సైబర్ సెక్యూరిటీ ఇష్యూ) 16 ఏళ్ల వయసున్న ఒక సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ గుర్తించి వెల్లడించాడు. ఈ లోపం కారణంగా లక్షలాది మంది విద్యార్థుల వ్యక్తిగత సమాచారం బహిర్గతమైంది. వెంటనే రంగంలోకి దిగిన ఐఐటీ రూర్కీ ఆ కుర్రాడికి  ధన్యవాదాలు చెబుతూ, తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

బహిర్గతమైన లక్షలాది మంది విద్యార్థుల డేటా
రైలన్ అనిల్ (@DarthKermy72747) అనే 16 ఏళ్ల విద్యార్థి, జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పబ్లిక్ క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లోపం ఉందని గుర్తించాడు. దీనివల్ల ఎలాంటి అథెంటికేషన్ (లాగిన్ వివరాలు) లేకుండానే విద్యార్థుల డేటా యాక్సెస్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీని ద్వారా దాదాపు 1,79,600 మంది ఫలితాల రికార్డులు, 1,87,300 అడ్మిట్ కార్డ్ పీడీఎఫ్‌లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో అభ్యర్థుల పేర్లు, పుట్టిన తేదీలు, మొబైల్ నంబర్లు వంటి అత్యంత కీలకమైన సమాచారం ఉంది.

దిద్దుబాటు చర్యల్లో ఐఐటీ రూర్కీ 
ఈ భద్రతా లోపాన్ని గుర్తించిన వెంటనే రైలన్ అనిల్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా ఐఐటీ రూర్కీని అప్రమత్తం చేశాడు. దీనిపై ఐఐటీ రూర్కీ స్పందిస్తూ.. ‘క్లౌడ్ స్టోరేజ్ డివైజ్‌లో కాన్ఫిగరేషన్ లోపాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు. ప్రాధాన్యత క్రమంలో దీనిని సరిచేస్తున్నాం. అయితే ఇందులో నిక్షిప్తమైన డేటా కేవలం ‘రీడ్-ఓన్లీ’ మోడ్‌లో మాత్రమే ఉంది. కాబట్టి ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. మీ బాధ్యతాయుతమైన ప్రవర్తనను అభినందిస్తున్నాం’ అని పేర్కొంది. దీనిపై సదరు విద్యార్థి స్పందిస్తూ, భద్రతను మెరుగుపరచడంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నాడు.

సీబీఎస్‌ఈ బోర్డులోనూ తీవ్ర గందరగోళం
మరోవైపు, పరీక్షల సాంకేతిక వ్యవస్థలపై దేశవ్యాప్తంగా నిఘా పెరిగిన తరుణంలో సీబీఎస్‌ఈ బోర్డులోనూ అలజడి రేగింది. క్లాస్ 12 మార్కుల పునఃపరిశీలన పోర్టల్‌లో సాంకేతిక లోపాలు, సైబర్ దాడుల ఆరోపణల నేపథ్యంలో సీబీఎస్‌ఈ చైర్మన్ రాహుల్ సింగ్, సెక్రటరీ హిమాన్షు గుప్తాలు బదిలీ అయ్యారు. ప్రశాంత్ లోఖండే కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంలో అవకతవకలు జరిగాయంటూ సార్థక్ సిద్ధాంత్ అనే 17 ఏళ్ల విద్యార్థి పార్లమెంటరీ కమిటీ ముందు హాజరై నివేదిక సమర్పించడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement