కోటా: రాజస్థాన్లోని కోటాలో ఒకే హాస్టల్లో ఉంటూ, ఒకే కల కోసం శ్రమించిన ఇద్దరు స్నేహితులు జేఈఈ అడ్వాన్స్డ్ -2026 పరీక్షలో దేశం గర్వించే ఫలితాలను సాధించారు. బీహార్కు చెందిన శుభమ్ కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంక్-1 (AIR 1) సాధించగా, గురుగ్రామ్కు చెందిన కబీర్ చిల్లర్ 329 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంక్-2 (AIR 2) దక్కించుకున్నారు. కేవలం ఒక్క మార్కు తేడాతో టాపర్లుగా నిలిచిన ఈ స్నేహితుల ప్రయాణం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కోటా హాస్టల్లో చిగురించిన స్నేహం
ఐఐటీ ప్రవేశ పరీక్షల కోసం సిద్ధమవుతున్న శుభమ్, కబీర్ కోటాలోని అలెన్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు. వీరు ఒకే హాస్టల్లో వేర్వేరు అంతస్తుల్లో ఉంటూ, తమ దైనందిన జీవితాన్ని క్రమశిక్షణతో గడిపేవారు. తరగతులు, అసైన్మెంట్లు, మాక్ టెస్టులతో నిరంతరం ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ప్రతిరోజూ సాయంత్రం బ్యాడ్మింటన్ ఆడుతూ పరీక్షల ఒత్తిడిని అధిగమించారు.
ఒక్క మార్కు తేడా.. కానీ సంబరాల్లో సమానం
ర్యాంకులో ఒక్క మార్కు తేడా ఉన్నా, వారి స్నేహంలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. గతంలో జేఈఈ మెయిన్లో AIR 1 సాధించిన కబీర్, తన స్నేహితుడు శుభమ్ మొదటి స్థానంలో నిలవడంపై ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ‘నా స్నేహితుడు టాప్ ర్యాంక్ సాధించడం నాకు గర్వంగా ఉంది. అతను దీనికి పూర్తిగా అర్హుడు’ అని కబీర్ పేర్కొన్నారు. అసూయకు తావులేకుండా, ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఐఐటీ వైపు అడుగులు
ఈ ఏడాది ఫలితాల్లో కోటా, రాజస్థాన్ ప్రాంతాల విద్యార్థుల ఆధిపత్యం మరోసారి కనిపించింది. మూడవ ర్యాంకును సికార్కి చెందిన జతిన్ చాహర్ కైవసం చేసుకోగా, వీరంతా అలెన్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులే కావడం గమనార్హం. ప్రస్తుతం శుభమ్, కబీర్ ఇద్దరూ ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదవాలనే లక్ష్యంతో ఉన్నారు. 1.87 లక్షల మంది పోటీపడిన ఈ పరీక్షలో 56,880 మంది అర్హత సాధించగా, ఈ స్నేహితుల విజయగాథ ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తోంది.
ఇది కూడా చదవండి: ‘వాడి జ్ఙాపకాలే ప్రాణంగా..’.. అహ్మదాబాద్ విషాదానికి ఏడాది


