జమ్ము కథువాలో ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి | Jammu Kashmir Kathua Terrorist Latest News | Sakshi
Sakshi News home page

జమ్ము కథువాలో ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి

Jul 8 2024 8:18 PM | Updated on Jul 8 2024 9:00 PM

Jammu Kashmir Kathua Terrorist Latest News

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌ కథువా జిల్లాలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఉగ్రదాడిలో నలుగురు జవాన్లు మృతిచెందారు. ఈ దాడిలోనే మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. 

మచెడి ప్రాంతంలో కిండ్లీ-మల్హార్‌ రోడ్‌లో పాట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. గ్రెనేడ్‌ విసిరి.. కాల్పులకు దిగారు. ప్రతిగా సైన్యం దాడికి దిగగా.. ఉగ్రవాదులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు. 

ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. గాయపడినవాళ్లకు  స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. మచెడి అడవుల్లో ఉగ్రవేట కొనసాగుతున్నట్లు భారత సైన్యం ప్రకటించింది.

ఇదిలా ఉంటే.. జమ్ములో గత 48 గంటల్లో ఉగ్రవాదులు జరిపిన రెండో దాడి ఇది.  ఆదివారం రాజౌరీ జిల్లాలోని ఆర్మీక్యాంప్‌పై ముష్కరులు జరిపిన దాడుల్లో ఓ సైనికుడు గాయపడ్డాడు. 

ఇంకోవైపు శనివారం కుల్గాంలో ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు మరణించగా, ఓ సైనికుడు గాయపడ్డాడు. అప్పటి నుంచి ఉగ్రవాడుల్ని సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుండగా.. రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో(మోడర్గాం, ఫ్రిసాల్‌ ఏరియా)  ఆరుగురు ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. 

Advertisement
 
Advertisement
Advertisement