ఇప్పుడే వద్దు! ఇద్దరు చాలు!! | Interesting facts about having children in the United Nations report | Sakshi
Sakshi News home page

ఇప్పుడే వద్దు! ఇద్దరు చాలు!!

Jun 18 2025 12:50 AM | Updated on Jun 18 2025 12:50 AM

Interesting facts about having children in the United Nations report

పిల్లలను కనడానికి ఆలోచిస్తున్న వైనం

వద్దనుకోవడం లేదా వాయిదాకు మొగ్గు

ఆర్థిక, అనారోగ్య సమస్యలే ప్రధాన కారణం

అమెరికా, భారత్‌లలో కొన్ని విషయాల్లో పోలికలు ఐక్యరాజ్యసమితి నివేదికలో ఆసక్తికర అంశాలు

‘ఉద్యోగం / వ్యాపారంలో స్థిరపడాలి. ఆ తర్వాతే పెళ్లి, పిల్లలు’.. ఇంతేగా ఓ సగటు యువతీ, యువకుడి ఆలోచన. ఇదంతా పెళ్లికి ముందు. పెళ్లి తర్వాత వారి ఆలోచనల్లో చాలా మార్పులొస్తున్నాయి. ఇప్పుడే వద్దు అని చెప్పేవారు కొందరైతే.. ఇద్దరిని మించి పెంచలేం బాబోయ్‌ అంటున్నవారు మరికొందరు. పిల్లలను వద్దనుకోవడానికి లేదా వాయిదా వేయడానికే మొగ్గుచూపుతున్న జంటల సంఖ్య పెరుగుతోంది. 

ప్రధానంగా విద్యావంతులైన మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. ఆర్థిక, అనారోగ్య సమస్యలే పిల్లలను కనాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

అనారోగ్య సమస్యలు 
వంధ్యత్వం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు భారత్‌లో 13 శాతం, అమెరికాలో 16 శాతం మంది వెల్లడించారు. పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) వంటి హార్మోన్ల సమస్యలు, థైరాయిడ్, ఊబకాయం వంటివి సంతానోత్పత్తికి ఆటంకంగా మారుతున్నాయి. సమయపాలన లేని ఆహారపుటలవాట్లు; విధులు, ఉద్యోగంలో భాగంగా గంటల తరబడి కంప్యూటర్లకు అతుక్కుపోవడం, శారీరక శ్రమ లేమి, వంశపారంపర్యంగా వస్తున్న సమస్యలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. 

గర్భధారణ సమయంలో సరైన వైద్య సంరక్షణ లేకపోవడం కారణమని భారత్‌లో 14 శాతం, యూఎస్‌లో 8 శాతం మంది తెలిపారు. గర్భం వచ్చిన తర్వాత తల్లి, బిడ్డ ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. వారు సూచించిన పరీక్షలు చేయించడంతోపాటు, మందులు వాడాలి. ఈ ప్రక్రియను ఆర్థికంగా భారంగా భావించడమో, లేదా వైద్య సౌకర్యాలు లేకపోవడమో కారణంగా.. మాతృత్వాన్ని కాదనుకోవడమో, వాయిదా వేయడమో చేస్తున్నారు.

చూసుకునేవారు లేక..
తగినంత/నాణ్యమైన పిల్లల సంరక్షణ అవకాశాలు లేకపోవడం కారణమని భారత్‌లో 18 శాతం, అమెరికాలో 12 శాతం మంది తెలిపారు. అంటే పిల్లలను చూసుకోవడానికి పెద్దవారు అందుబాటులో లేకపోవడం, సంరక్షణ కేంద్రాల లేమి.. కుటుంబాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. పిల్లలను చూసుకునేవారు లేకపోతే తల్లిదండ్రులు పని చేయడం కష్టతరం అవుతుంది. వారి ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మహిళలు ఉద్యోగాలకు దూరం కావడానికి దారితీస్తుంది. ఇలాంటి కారణాలతో భాగస్వామి తక్కువ మంది పిల్లలను కోరుకోవడమూ ప్రధాన కారణమని భారత్, యూఎస్‌లలో 19 శాతం మంది వెల్లడించారు.

మనదేశంలో జననాల రేటు 1960లలో సగటున ఒక్కో మహిళకు సుమారు 6గురు పిల్లలుగా  ఉండేది. ఇప్పుడు ఇది 1.9కి పడిపోయింది. అంటే ఇద్దరు పిల్లలు కూడా కాదన్నమాట. ప్రపంచ సగటు 2.2తో పోలిస్తే ఇది తక్కువే. ఇందుకు ఆర్థిక పరిమితులు, ఉద్యోగ అభద్రత, అనారోగ్య సమస్యలు... ఇలా ఎన్నో కారణాలు. యునైటెడ్‌ నేషన్స్  పాపులేషన్  ఫండ్‌ (యూఎన్‌ఎఫ్‌పీఏ) రూపొందించిన ‘స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ 2025’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.  ప్రపంచ జనాభాలో 37 శాతం మంది ఉన్న భారత్, అమెరికా వంటి 14 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు.

ఇద్దరు చాలంటున్నారు
ఎంతమంది పిల్లలు కావాలని అడిగితే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చెప్పిన సమాధానం.. ఇద్దరు! మనదేశంలో అసలు పిల్లలే వద్దన్నవారు సగటున 5 శాతం కాగా, ఇది అమెరికాలో సుమారు 14 శాతం కావడం గమనార్హం. ఒక్కరే చాలని మనదేశంలో సగటున 14 శాతం మంది చెబితే.. అమెరికాలో కేవలం 7 శాతం మందే ఇలా కోరుకున్నారు. 

ఇద్దరు బిడ్డలు కావాలని మనదేశంలో పురుషుల్లో 33 శాతం, మహిళల్లో 41 శాతం మంది చెప్పారు. అమెరికాలో ఇలా కావాలన్నవారి సగటు కేవలం 26 శాతమే. మనదేశంలో ముగ్గురు లేదా నలుగురు పిల్లలు కావాలన్నవారు స్త్రీ, పురుషుల్లో గరిష్ఠంగా 6 శాతాన్ని కూడా మించలేదు. ఆసక్తికరంగా అమెరికాలో ఇలా కావాలన్నవారు దాదాపు 16 శాతం.

ఆర్థిక పరిమితులు
భారత్, అమెరికాలో ఆర్థిక పరిమితులే ప్రధానంగా మాతృత్వానికి అడ్డంకిగా ఉన్నాయని 38 శాతం మంది వెల్లడించారు. ఆదాయ అసమానతలు, అప్పులు పేరుకుపోవడం, ఊహించని ఖర్చులు,  ఉద్యోగ భద్రత లేకపోవడం, నిరుద్యోగం, పొదుపు లేకపోవడం లేదా సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వంటి ఆర్థిక పరిమితులు చుట్టుముడుతున్నాయి. ఈ సవాళ్లే కుటుంబ జీవితంలోని వివిధ అంశాలను.. ప్రధానంగా బిడ్డలను కనాలన్న నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. 

పిల్లలను వద్దనుకోవడానికి.. నిరుద్యోగం లేదా ఉద్యోగం పోతుందేమోనన్న అభద్రతాభావం కారణమని 21 శాతం భారతీయులు, 17 శాతం అమెరికన్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జాబ్‌ మార్కెట్‌లో అనిశ్చితి ఒకవైపు.. ఏఐ వంటి నూతన సాంకేతికత రాకతో కొన్ని రంగాలకు చెందిన పలు విభాగాల్లో ఉద్యోగుల తీసివేతలు మరోవైపు.. వెరసి యువతకు ఉద్యోగాలు, కొత్త అవకాశాల వేట తప్పడం లేదు. ఇవన్నీ కూడా పిల్లలను కనాలా వద్దా అన్న నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement