
దక్షిణ కన్నడ జిల్లాలో విషాదం
ఇద్దరూ వివాహితులే
యశవంతపుర(కర్ణాటక): ఇన్స్టా.. సోషల్ మీడియా లవ్ కాపురాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఏం చేస్తున్నామో అనే స్పృహ లేకుండా ప్రవర్తిస్తూ కుటుంబాలను వీధుల్లో పడేస్తున్నారు. పెళ్లయిన మహిళ, పురుషుడు ఇన్స్టా ద్వారా ప్రేమ అనే వ్యామోహంలో పడి, ఆపై బావిలోకి దూకి ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాద సంఘటన దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె తాలూకా బడగమిజారు లో వెలుగులోకి వచ్చింది.
వివరాలు.. మూడబిదిరె తాలూకా బడగమిజారుకు చెందిన వివాహిత నమీక్ష శెట్టి (29), ఆమె ప్రియుడు బాగలకోటలో నిడ్డోడిలో నివాసం ఉంటున్న ప్రశాంత్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నమీక్ష శెట్టికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఆమె భర్త పూణెలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె పుట్టింటిలో ఉంటోంది. ఆమెకు ఇన్స్టా గ్రాంలో ప్రశాంత్తో పరిచయం ఏర్పడింది. డ్రైవర్ అయిన ఇతనికి కూడా పెళ్లయి భార్యతో విడాకులు తీసుకున్నారు.
అప్పుడప్పుడు ప్రశాంత్, నమీక్ష ఇంటికి వచ్చి వెళ్లేవాడు. బుధవారం కూడా ఆమె ఇంటికి వచ్చాడు, అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమె పరుగున వెళ్లి ఇంటి పక్కనే ఉన్న బావిలోకి దూకింది. వెంటనే ప్రశాంత్ కూడా బావిలోకి దూకేశాడు. ఫైర్ సిబ్బంది, పోలీసులు గాలించి మృతదేహాలను బావిలోంచి బయటకు తీశారు. మూడబిదిరె ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతుదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.