
5 ఏళ్లలో 32% పెరిగిన జనాభా
674 నుంచి 891కు పెరిగిన సింహాల సంఖ్య
‘ప్రాజెక్ట్ లయన్’ఫలితమేనన్న కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే ప్రసిద్ధి చెందిన గిర్ అడవుల్లో ఆసియాటిక్ సింహాల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. 2020లో 674గా ఉన్న ఈ సింహాల సంఖ్య 2025 నాటికి 891కి పెరిగింది. కేవలం ఐదేళ్లలో 32 శాతం వృద్ధి సాధ్యమైంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ వృద్ధిని ‘ప్రాజెక్ట్ లయన్’విజయానికి నిదర్శనంగా అభివరి్ణంచారు.
గుజరాత్లోని దేవభూమి ద్వారక జిల్లాలోని బర్డా వన్యప్రాణి అభయారణ్యంలో జరిగిన ప్రపంచ సింహ దినోత్సవ వేడుకల్లో భూపేందర్ యాదవ్ మాట్లాడారు. సింహాల సంరక్షణపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గానూ, అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపారని మంత్రి యాదవ్ గుర్తు చేశారు. 1990లో 284 మాత్రమే ఉన్న సింహాల సంఖ్య 2025లో 891కి చేరడం ప్రపంచ వన్యప్రాణి సంరక్షణలో అరుదైన ఘనత అని చెప్పారు. ‘సింహం గిర్లోనే ఉంది. ఇది గుజరాత్ గౌరవం, భారత పర్యావరణ బలానికి ప్రతీక’అన్నారు.
బర్డాలో రూ.180 కోట్ల ప్రాజెక్టులు
గుజరాత్లోని బర్డా ప్రాంతంలో 143 ఏళ్ల తర్వాత మళ్లీ సింహాల నివాసం ఏర్పడిందని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. బర్దా వన్యప్రాణి అభయారణ్యం పోర్ బందర్, దేవభూమి ద్వారకా జిల్లాల్లో 192.31 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 2023లో సింహం ఈ ప్రాంతానికి సహజంగా వలస వచి్చన తరువాత, సింహాల సంఖ్య 17కు పెరిగింది. అందులో 6 పెద్దవి, 11 పిల్లలు ఉన్నాయని వెల్లడించారు. అంతేగాక› సుమారు 248 హెక్టార్ల విస్తీర్ణంలో సఫారీ పార్కును ప్రారంభించాలని యోచిస్తున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. సింహాల వెటర్నరీ కేర్, నూతన హాబిటాట్స్, ఇకోటూరిజం మౌలిక సదుపాయాల కోసం రూ.180 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ప్రాజెక్ట్ లయన్
2020 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రకటించిన ప్రాజెక్ట్ లయన్కు 10 ఏళ్ల కాలానికి రూ.2,927.71 కోట్ల నిధులు కేటాయించారు. గుజరాత్లోని 11 జిల్లాల్లో సుమారు 35 వేల చదరపు కి.మీ. విస్తీర్ణంలో సింహాల ఉనికి విస్తరించి ఉంది. బర్డా వన్యప్రాణి అభయారణ్యంను రెండో సింహ నివాసంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.