
చాలాకాలం తర్వాత అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూశాయి.
ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య పైపైకి చేరుకుంటోంది. దాదాపు ఐదునెలల తర్వాత ఐదు వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. గురువారం కేంద్ర కుటుంబ సంక్షేమ ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 5,353 కేసులు నమోదు అయ్యాయి.
చాలాకాలం తర్వాత అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల్లో 5,353 కేసులు(నిన్న ఆ సంఖ్య 4,435గా ఉంది) నమోదు అయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య పాతిక వేలు(25,587) దాటింది. కేరళలో అత్యధికంగా కోవిడ్ కేసులు వెలుగు చూడగా, ఆ తర్వాతి ప్లేస్లో మహారాష్ట్ర ఉంది. మరోవైపు రాజధాని ప్రాంతంలోనూ కేసులు విజృంభిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో ఆరుగురు కరోనాతో కన్నుమూశారు.
అదే సమయంలో కరోనా నుంచి గత 24 గంటల్లో 2,826 మంది కోలుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఎక్స్బీబీ.1.16 వేరియెంట్ కారణాంగానే వైరస్ విజృంభిస్తోందని వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. రాబోయే రోజుల్లో వైరస్ విజృంభణ ఉంటుందని, జాగ్రత్తలు పాటించాలని ప్రజలకూ సూచించింది. మరోవైపు ఏప్రిల్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా కరోనాను ఎదుర్కొనేందుకు మాక్డ్రిల్ నిర్వహించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది.