ఆ క్షణంలోనే చనిపోయేవాడిని.. అందుకే బ‌తికున్నా.. | I am proud of his sacrifice says Pahalgam incident victim father | Sakshi
Sakshi News home page

Pahalgam: కొడుకు ప్రాణ‌త్యాగం.. గ‌ర్వంగా ఉంద‌న్న తండ్రి

Apr 25 2025 8:05 PM | Updated on Apr 25 2025 8:05 PM

సయ్యద్ హైదర్ షా కుటుంబ స‌భ్యులు (ఏఎన్ఐ ఫొటో)

సయ్యద్ హైదర్ షా కుటుంబ స‌భ్యులు (ఏఎన్ఐ ఫొటో)

ప‌హ‌ల్‌గావ్ ఉగ్ర‌దాడికి బ‌లైన స్థానిక యువ‌కుడు ఆదిల్ హుస్సేన్

టూరిస్టులను కాపాడి ప్రాణాలు కోల్పోయిన ఆదిల్ 

ఆదిల్ త్యాగాన్ని స్మ‌రించుకుంటున్న కుటుంబ స‌భ్యులు

ఆదిల్ కుటుంబానికి అండ‌గా ఉంటామ‌న్న‌ సీఎం అబ్దుల్లా

''నేను నా కుమారుడి గురించి, అతడు చేసిన‌ షహాదత్ (త్యాగం) కార‌ణంగా గర్వపడుతున్నాను. ఆ గర్వం వల్లనే నేను బతికి ఉన్నాను. లేకపోతే నా కుమారుడి నిర్జీవ శరీరాన్ని చూసిన క్షణంలోనే చనిపోయేవాడిని'' - ఈ మాట‌లు అన్న‌ది ప‌హ‌ల్‌గావ్‌కు చెందిన సయ్యద్ హైదర్ షా. మంగ‌ళ‌వారం నాటి ముష్క‌ర‌మూక దాడిలో త‌న పెద్ద కుమారుడిని ఆయ‌న కోల్పోయారు. కుటుంబ పోష‌కుడిగా ఉన్న కొడుకు ఉగ్ర‌వాదుల తూటాల‌కు బ‌లైపోవ‌డంతో హైదర్ షా కుటుంబం దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో ప‌డిపోయింది. ఇంత‌టి విషాదంలోనూ కొడుకు చేసిన త్యాగాన్ని హైదర్ షా ప‌దేప‌దే త‌ల‌చుకుంటున్నారు.

జమ్మూక‌శ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా ప‌హ‌ల్‌గావ్ (Pahalgam) బైస‌ర‌న్ లోయ‌లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ప‌ర్యాట‌కుల‌పై ఉగ్ర‌వాదులు జ‌రిపిన మెరుపుదాడిలో 27 మంది అమాయ‌కులు అసువులు బాశారు. అయితే త‌న క‌ళ్లెదుటే ప‌ర్యాట‌కుల‌ను చంపుతుంటే హైదర్ షా కొడుకు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా చూస్తూ ఉండ‌లేక‌పోయాడు. ఉగ్ర‌వాదులను ఎదిరించి టూరిస్టుల ప్రాణాలు కాపాడాల‌నుకున్నాడు. కానీ ముష్క‌రుల తుపాకీ తూటాల‌కు అడ్డుగా నిల‌బ‌డి ప్రాణాలు కోల్పోయాడు.

రోజూ మాదిరిగానే ఆదిల్ ఆ రోజు ఉద‌యం ప‌నికి వెళ్లాడు. ప‌ర్యాట‌కుల‌ను గుర్రంపై ఎక్కించుకుని తీసుకెళ్ల‌డం అత‌డి ప‌ని. అయితే ఉగ్ర‌దాడి జ‌రిగిన వెంట‌నే మ‌ధ్యాహ్నం 3 గంట‌ల ప్రాంతంలో ఆదిల్ కుటుంబానికి ఈ వార్త తెలిసింది. వెంట‌నే వారు ఆదిల్ ఫోన్ చేశారు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్త‌క‌పోవ‌డంతో వారు భయాందోళ‌న‌తో స్థానిక పోలీస్ స్టేష‌న్‌కు, అక్క‌డి నుంచి ఆస్ప‌త్రికి ప‌రుగులు పెట్టారు. త‌న‌ కుమారుడికి బుల్లెట్ గాయాల‌య్యాయ‌ని తెలిసి హైదర్ షా హ‌తాశుల‌య్యారు. "సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నా కుమారుడు ఆసుపత్రిలో ఉన్నాడ‌ని మాకు తెలిసింది. అతడి కోసం వెతుకుతున్న వ్యక్తులు ఈ సంఘటన గురించి నాకు సమాచారం అందించారు" అని హైదర్ గుర్తుచేసుకున్నారు. త‌న కొడుకు కొంత‌మంది ప్రాణాలు కాపాడి చనిపోయినందుకు గ‌ర్వప‌డుతున్నాన‌ని ఆయ‌న ఏఎన్ఐతో చెప్పారు.

మాకు దిక్కెవ‌రు?
త‌మ ఇంటికి మూలస్తంభంగా నిలిచిన కొడుకు అనూహ్యంగా చనిపోవ‌డంతో ఆదిల్ త‌ల్లి శోక‌సంద్రంలో ముగినిపోయింది. ఇప్పుడు త‌మను ఎవ‌రు పోషిస్తార‌ని అంటూ రోదిస్తోంది.  ''నా కుమారుడు రోజుకు 300 రూపాయిలు సంపాదించేవాడు. అత‌డు తెచ్చిన డ‌బ్బుల‌తో సాయంత్రం బియ్యం కొని, వంట చేసుకుని కలిసి తినేవాళ్ళం. ఇప్పుడు మాకు ఎవరు ఆహారం తెస్తారు? ఎవరు మందులు తెస్తారు?" అంటూ ఆదిల్ త‌ల్లి క‌న్నీరుమున్నీర‌వుతోంది. ప‌ర్యాట‌కుల‌ను ర‌క్షించే క్ర‌మంలో త‌న కొడుకు ప్రాణాలు ఫ‌ణంగా పెట్టాడ‌ని, వారు కూడా మన సోదరులేన‌ని అంటూ ఆమె మాన‌వ‌త్వాన్ని చాటారు.

శాశ్వ‌తంగా సెలవు..
ఇంటికి త్వ‌ర‌గా వ‌చ్చేస్తాన‌ని వెళ్లి ఉగ్ర‌దాడికి ఆదిల్ బ‌లైపోయాడ‌ని ఆదిల్ సోదరి రవిసా ఆవేద‌న చెందింది. ''త‌న‌కు ఆరోగ్యం బాలేదు. ఒక రోజు సెలవు తీసుకుంటానని చెప్పాడు. త్వ‌ర‌గా వ‌చ్చేస్తాన‌ని ప‌నికి వెళ్లాడు. కానీ అతడు తిరిగి రాలేదు. ఉగ్ర‌వాదుల నుంచి తుపాకీని లాక్కొని టూరిస్టుల‌ను కాపాడటానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. ఛాతీలో మూడు, గొంతులో ఒక బుల్లెట్ దిగింద‌''ని రవిసా రోదించింది.

చ‌దవండి: ప్రాణాలు కాపాడిన ఉప్పు

అండ‌గా ఉంటామ‌న్న అబ్దుల్లా
ప‌ర్యాట‌కుల‌ను ర‌క్షించేందుకు త‌న ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టిన ఆదిల్‌ను స్థానికులు రియ‌ల్‌ హీరోగా కొనియాడారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే విధంగా స్పందించారు. స్వ‌యంగా ఆదిల్ ఇంటికి వెళ్లి అత‌డి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. ఆదిల్ కుటుంబానికి అన్నివిధాలా అండ‌గా ఉంటామ‌ని భ‌రోసాయిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement