జిమ్‌లు రేపట్నుంచే..

Govt issues guidelines for reopening of gyms, yoga institutes - Sakshi

కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ

ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేనివారికే అనుమతి

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ:  నాలుగున్నర నెలల విరామం తర్వాత దేశవ్యాప్తంగా జిమ్‌లు, యోగా కేంద్రాలు బుధవారం నుంచి తెరుచుకోనున్నాయి. అన్‌లాక్‌–3.0లో వీటిని తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘యోగా కేంద్రాలు, జిమ్‌లలో కరోనా వ్యాప్తి నివారణ మార్గదర్శకాలను’ సోమవారం జారీ చేసింది.

ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వారిని మాత్రమే యోగా కేంద్రాలు, జిమ్‌లలోకి అనుమతించాలని తేల్చిచెప్పింది. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. కంటైన్‌మెంట్‌ జోన్లలోని యోగా కేంద్రాలు, జిమ్‌లు మూసి ఉంటాయి. ఈ జోన్ల వెలుపల ఉన్న వాటిని మాత్రమే తెరిచేందుకు అనుమతిస్తారు.  

మార్గదర్శకాలివే..
► స్పాలు, స్టీమ్‌ బాత్, స్విమ్మింగ్‌ పూల్స్‌ మూసివేయాలి.  

► యోగా సెంటర్లు, జిమ్‌లలో అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకోవాలి. వ్యక్తుల మధ్య కనీసం 4 మీటర్ల దూరం ఉండేలా రీడిజైనింగ్‌ చేయించాల్సి ఉంటుంది.  

► జిమ్‌లో సెంట్రలైజ్డ్‌ ఏసీ లేదా సాధారణ ఏసీ ఉంటే గది ఉష్ణోగ్రత 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉంచాలి.  వెంటిలేషన్‌ అధికంగా ఉండేలా చూడాలి.

► 65 ఏళ్ల వయసు పైబడినవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు జిమ్‌లకు వెళ్లకపోవడమే మంచిది.  

► హ్యాండ్‌ శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకున్న తర్వాతే ఎవరైనా యోగా సెంటర్‌/జిమ్‌ లోపలికి ప్రవేశించాలి. ప్రవేశ ద్వారం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టు కూడా చేయించుకోవడం తప్పనిసరి.   

► ఫేస్‌ మాస్కు/కవర్‌ ధరించిన వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి.  

► యోగా కేంద్రం/జిమ్‌లో ఉన్నంత సేపు ఆరోగ్యసేతు యాప్‌ ఉపయోగించాలి.

► జిమ్‌/యోగా కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందితో పాటు విజిటర్స్‌ తప్పకుండా ఫేస్‌ షీల్డ్‌లు ధరించాలి.   

►  కార్డియో, స్ట్రెంత్‌ ట్రైనింగ్‌ వంటి కఠినమైన వ్యాయామాలు చేసేముందు పల్స్‌ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్‌ స్థాయిలను పరీక్షించుకోవాలి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top