Sajay Pandey: ఆటోలో ఈడీ విచారణకు మాజీ సీపీ | Sakshi
Sakshi News home page

ఆటోలో సాదాసీదాగా ఈడీ విచారణకు ముంబై మాజీ కమిషనర్‌

Published Tue, Jul 5 2022 9:15 PM

Enforcement Directorate questions ex Mumbai CP Sanjay Pandey - Sakshi

ఢిల్లీ: అత్యున్నత అధికారిగా ప్రభుత్వం నుంచి మన్ననలు, నిజాయితీపరుడిగా ప్రజల నుంచి పొగడ్తలు అందుకున్నారాయన. అలాంటి వ్యక్తి.. సాదాసీదాగా ఈడీ విచారణకు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ముంబై మాజీ కమిషనర్‌ సంజయ్‌ పాండే మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యాడు. ఒంటరిగా ఆటోలో ఢిల్లీ ఈడీ కార్యాలయానికి సంజయ్‌ పాండే చేరుకోవడం.. ఒక్కరే విచారణను ఎదుర్కోవడం.. ఈడీ ప్రాంగణంలో ఆయన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌(NSE) కో-లొకేషన్‌ స్కామ్‌కు సంబంధించి విచారణ కోసం ఆయన హాజరయ్యారు. వారం కిందటే.. ఆయన ముంబై పోలీస్‌ కమిషనర్‌గా రిటైర్డ్‌ అయిన విషయం తెలిసే ఉంటుంది. రెండున్నర గంటలపాటు ఆయన్ని ప్రశ్నించింది ఈడీ.. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌లోని క్రిమినల్‌ సెక్షన్స్‌‌-50 ప్రకారం ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. 

ఐసెక్‌ సెక్యూరిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి సంబంధించిన కార్యకలాపాల గురించి ఆయన్ని ప్రశ్నించింది ఈడీ. ఎన్‌ఎస్‌ఈ సెక్యూరిటీ అడిట్‌కు సంబంధించి.. కో-లొకేషన్‌ ఇర్రెగ్యులారిటీస్‌ ఈ కంపెనీలోనూ చోటు చేసుకున్నాయి. పైగా ఈ కంపెనీని పాండేనే 2001 మార్చిలో స్థాపించారు. 2006లో దాని డైరెక్టర్‌గా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన తల్లికుమారుడు.. ఆ కంపెనీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్‌ స్కామ్‌ను 2018 నుంచి సీబీఐ దర్యాప్తు చేస్తోంది. 

1986 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన సంజయ్‌ పాండే.. ఐఐటీ-కాన్పూర్ గ్రాడ్యుయేట్‌. హర్వార్డ్‌ యూనివర్సిటీలోనూ ఉన్నత విద్యను అభ్యసించారు. బాంబే అల్లర్ల సమయంలో డీసీపీగా ఆయన తెగువ.. ప్రజల నుంచి మన్ననలు అందుకునేలా చేసింది. ఆర్థిక నేరాల విభాగం తరపున 1998లో కోబ్లర్‌ స్కామ్‌ ఆయన్ని వివాదంలోకి నెట్టింది. ఆపై సెంట్రల్‌డిప్యూటేషన్‌ మీద పీఎం సెక్యూరిటీ యూనిట్‌కు ఆయన ఎటాచ్‌ అయ్యారు. 

ముంబై కమిషనర్‌గా మాత్రమే కాదు.. మహారాష్ట్రకు తాత్కాలిక డీజీపీగానూ విధులు నిర్వహించారు కూడా. అయితే పోలీసులు విధులకు రాజీనామా చేసిన తర్వాతే ఆయన కంపెనీని స్థాపించగా.. అప్పటి ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదించకపోవడంతో తిరిగి విధుల్లో చేరారు. సమర్థవంతుడైన ఆఫీసర్‌గా పేరున్న సంజయ్‌ పాండే.. ఈడీ విచారణ ఎదుర్కోవడంపై సోషల్‌ మీడియాలోనూ పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది.

Advertisement
Advertisement