‘దేశం నుంచి పారిపోకుండా’.. అనిల్‌ అంబానీపై లుకౌట్‌ నోటీసులు | ED issue Lookout Notice Against Anil Ambani | Sakshi
Sakshi News home page

‘దేశం నుంచి పారిపోకుండా’.. అనిల్‌ అంబానీపై లుకౌట్‌ నోటీసులు

Aug 1 2025 7:35 PM | Updated on Aug 1 2025 7:49 PM

ED issue Lookout Notice Against Anil Ambani

సాక్షి,న్యూఢిల్లీ: బ్యాంకుల రుణాల ఎగవేత కేసుల్లో రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది. రూ.3,000 కోట్ల రుణ మోసం కేసుకు సంబంధించి ఈడీ శుక్రవారం (ఆగస్ట్‌1న) సర్క్యులర్ జారీ చేసింది.

లుకౌట్‌ నోటీసులు కంటే ముందు బ్యాంకు రుణాల ఎగవేత కేసులో  అనిల్ అంబానీకి ఈడీ సమన్లు పంపింది.  ఆగస్టు 5న ఈడీ ముందుకు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే అనిల్‌ అంబానీకి సంబంధించిన కంపెనీల్లో సోదాలు నిర్వహించి పలుచోట్ల కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన ఈడీ అనిల్‌ను ప్రశ్నించేందుకు తాజాగా సమన్లు జారీ చేసింది.  

ఈ నేపథ్యంలో ఈడీ విచారణ నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది. విమానాశ్రయాలు, ఓడరేవులు సహా అన్ని ఎంట్రీ,ఎగ్జిట్ పాయింట్లకు దీనిని పంపిస్తుంది. దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అలాంటి నోటీసులు జారీ చేయబడిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని అధికారులను ఈడీ అధికారులు అప్రమత్తం చేస్తారు. 

రూ.3,000 కోట్ల రుణాలను 
2017 నుంచి 2019 వరకు ఎస్‌ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్ఎల్)కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణ వితరణ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.8,670.80 కోట్లకు పెరిగింది. ఎస్‌ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు సంబంధించిన లంచం కోణంలో కూడా విచారణ జరిపినట్లు ఈడీ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement