Delhi Air Pollution Updates: Work From Home Announced For 50% Govt Staff, Details Inside - Sakshi
Sakshi News home page

Delhi-NCR Pollution: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. కేజ్రీవాల్‌ సర్కార్‌ కీలక నిర్ణయాలు

Nov 4 2022 1:56 PM | Updated on Nov 4 2022 3:41 PM

Delhi Pollution Updates: 50 Percent Delhi govt Staff WFH Details Inside - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. గాలి నాణ్యత రోజురోజుకు తక్కువ స్థాయికి పడిపోతుంది. గాలి నాణ్య‌త మెరుగు ప‌డేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం నడుం బిగించింది. గాలి నాణ్య‌త‌ 450 పాయింట్ల తీవ్ర స్థాయికి చేర‌డంతో పలు కీలక చర్యలకు ఉపక్రమించింది. 50% ఢిల్లీ ప్రభుత్వ సిబ్బంది ఇంటి నుంచి పని చేసేలా(వర్క్‌ ఫ్రం హోమ్‌) ఆదేశాలు జారీ చేసింది. ప్రేవేటు కార్యాలయాలు కూడా ఈ పద్దతినే అనుసరించాలని పేర్కొంది. 

పాఠశాలలు బంద్‌
ఢిల్లీలో శనివారం నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 5వ తరగతి పై విద్యార్థులు బహిరంగ ఆటలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.  సరి బేసి విధానం గురించి ఆలోచిస్తున్నామని పేర్కొంది.
చదవండి: ఎంత క్రూరం! కాలితో తన్నాడు.. జనం ఊరుకోలేదు!

ఆ వాహనాలపై నిషేదం
కేవలం అత్య‌వ‌స‌ర‌ వ‌స్తువుల్ని ర‌వాణా చేసే వాహనాలు, సీఎన్‌జీతో న‌డిచే వాహనాల్ని, ఎల‌క్ట్రిక్ బండ్ల‌ను మాత్ర‌మే ఢిల్లీలోకి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద‌ వాహ‌నాలు, బిఎస్‌-4 డీజిల్ ఇంజిన్ వాహ‌నాలు ఢిల్లీలోకి రాకుండా నిషేధం విధించింది.  క‌మ‌ర్షియ‌ల్ డీజిల్ ట్ర‌క్స్ వాహనాలు కూడా ఢిల్లీ, ప‌రిస‌ర ప్రాంతాల్లోకి  అనుమతించ‌వ‌ద్ద‌ని నిర్ణ‌యం తీసుకుంది.అంతేగాక రోడ్లు వేయ‌డం, వంతెన‌లు నిర్మించ‌డం, ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిలు, ప‌వ‌ర్ ట్రాన్సిమిష‌న్ యూనిట్లు, పైప్‌లైన్ నిర్మాణం వంటి పెద్ద ప్రాజెక్టుల్నినిలిపివేయ‌నున్నారు. అలాగే గతేడాది  అవ‌లంబించినటే స‌రి, భేసి విధానంలో వాహనాల్ని అనుమ‌తించాలి  యోచిస్తోంది ఢిల్లీ సర్కార్‌.

అప్రమత్తమైన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ అప్రమత్తమైంది. ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఈ రష్ట్రాల సీఎస్‌లను నవంబర్ 10లోపు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ముందు హాజరు కావాలని కోరింది.

పంజాబ్‌లో పంట వ్యర్ధాల‌ను రైతులు కాల్చివేస్తుండటం వ‌ల్ల ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శుక్రవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ సింగ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వాయు కాలుష్యం అనేది ఉత్తర భారతదేశ సమస్య అని, ఢిల్లీ ప్రభుత్వం లేదా పంజాబ్ ప్రభుత్వం మాత్రమే దీనికి బాధ్యత వహించవని అన్నారు. దీనికి ఒకరిపై ఒకరు నిందలు వేయడానికి సమయం కాదని అన్నారు.

రైతులను తప్పు పట్టలేం
ఒక‌వేళ పంజాబ్‌లో పంట‌ల వ్య‌ర్ధాల‌ను కాల్చివేస్తున్నారంటే దానికి తామే బాధ్యుల‌మ‌ని కేజ్రీవాల్ తెలిపారు. వ‌రి పంట వ్య‌ర్ధాల్ని కాల్చివేయాల‌ని రైతులు కూడా కోరుకోవ‌డం లేద‌ని, కానీ రెండు పంట‌ల మ‌ధ్య త‌క్కువ స‌మ‌యం ఉన్నందున వాళ్లకు మ‌రో అవ‌కాశం లేద‌ని పేర్కొన్నారు.ఆ వ్యాఖ్య‌ల‌ను పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ కూడా అంగీక‌రిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

పడిపోతున్న గాలి నాణ్యత
ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో గురువారం దట్టంగా పొగమంచు పేరుకుపోయింది. గాలి నాణ్యత సూచికలో ప్రస్తుతం యూపీలోని నోయిడా 562తో తీవ్ర స్థాయిలో ఉంది. ఆ తరువాత గురుగ్రామ్ 539(హర్యానా). ఢిల్లీ యూనివర్సీటీ సమీపంలో 563 ఉన్నాయి. ఢిల్లీలో ప్రస్తుత గాలి నాణ్యత 472గా ఉంది.  ఘజియాబాద్-391, నోయిడా-388, గ్రేటర్ నోయిడా-390, గురుగ్రామ్-391,  ఫరీదాబాద్-347గా నమోదైంది. 

Advertisement
 
Advertisement
Advertisement