చలో సంసద్‌.. షాక్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ! | CJP Removes Spokesperson Vijeta Dahiya After Viral Burger Video Sparks Controversy, Check Out More Details | Sakshi
Sakshi News home page

చలో సంసద్‌.. షాక్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ!

Jul 21 2026 9:09 PM | Updated on Jul 22 2026 11:34 AM

CJP removes spokesperson Vijeta Dahiya over burger videos during protest

న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నియమావళిని ఉల్లంఘించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొంటూ పార్టీ అధికార ప్రతినిధి విజేత దహియాను పార్టీ పదవి నుంచి తొలగించారు. దీంతో సీజేపీ నేతలకు షాక్‌ తగిలినట్లైంది.   

నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ మంగళవారం ‘చలో సంసద్‌’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పార్టీ పిలుపుతో విద్యార్థులు, తల్లిదండ్రులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున ఢిల్లీలోని జంతర్‌మంతర్‌, పార్లమెంట్‌ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. భారీగా జనసమూహం రావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి, నిరసనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సమయంలో పార్టీ అధికార ప్రతినిధి విజేత దహియా ఢిల్లీలోని ఓ బర్గర్‌ అవుట్‌లెట్‌లో బర్గర్ కొనుగోలు చేసి కారులో కూర్చొని తింటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు నిరసనలో పాల్గొంటున్న వేళ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకులు  ఇలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మరికొన్ని వీడియోల్లో అతన్ని  కొందరు నిలదీస్తూ, నిరసనకు మద్దతుగా నిలవకుండా బర్గర్ ఎందుకు తింటున్నారని ప్రశ్నించిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి.

ఈ ఘటనపై స్పందించిన అభిజిత్ దీప్కే, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకే విజేత దహియాను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

 

 

విమర్శలపై స్పందించిన విజేత దహియా మాత్రం తాను నిరసన కార్యక్రమంలో పూర్తిగా పాల్గొన్నానని, అది ముగిసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్లానని తెలిపారు. రెండు రోజులుగా ఉద్యమ కార్యక్రమాలతో నిద్ర లేకుండా పనిచేశానని, ఇంటికి వెళ్లే మార్గంలో ఆకలి వేయడంతో ఆహారం తీసుకున్నానని చెప్పారు. బర్గర్ తినడంలో తప్పేముంది? ఆకలి వేసింది కాబట్టి తిన్నాను. దేశం కోసం ఉద్యమం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు ఎవరూ డబ్బులు ఇవ్వడం లేదు’అని ఆమె పేర్కొన్నారు.

కాగా, ట్రాన్స్‌జెండర్లపై చేసిన వ్యాఖ్యలు, మహిళల రాజకీయ అవగాహనపై చేసిన వ్యాఖ్యల కారణంగా విజేత దహియా గతంలోనూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు నిరసన కార్యక్రమం సందర్భంగా వైరల్ అయిన వీడియోలతో దహియా వివాదం మరింత ముదిరి, చివరకు పార్టీ అతన్ని పదవి నుంచి తొలగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement