ఈసారి 95 విమానాలకు బాంబు బెదిరింపులు | Bomb threats to Indian flights continue | Sakshi
Sakshi News home page

ఈసారి 95 విమానాలకు బాంబు బెదిరింపులు

Oct 25 2024 3:56 AM | Updated on Oct 25 2024 3:56 AM

Bomb threats to Indian flights continue

11 రోజుల్లో మొత్తం 250 సర్వీసులకు బాంబు హెచ్చరికలు

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థలకు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. గురువారం మొత్తం 95 విమానాల సర్వీసుల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ వట్టివేనని తేలింది. ఇందులో ఆకాశ ఎయిర్‌కు చెందిన 25, ఎయిరిండియా, ఇండిగో, విస్తారలకు చెందిన 20 చొప్పున, స్పైస్‌ జెట్, అలయెన్స్‌ ఎయిర్‌లకు చెందిన ఐదేసి విమానాలు ఉన్నాయి. 

దీంతో గడిచిన 11 రోజుల్లో 250కు పైగా సర్వీసులకు బెదిరింపులు అందినట్లయింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆగంతకులు చేసిన హెచ్చరికలతో అధికార యంత్రాంగం, రక్షణ బలగాలు, విమా నాశ్రయాల సిబ్బందితోపాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు, అసౌకర్యానికి లోనయ్యారు. విమానయాన సంస్థలకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది. 

ఇండిగోకు చెందిన హైదరాబాద్‌– గోవా, కోల్‌కతా–హైదరాబాద్, కోల్‌కతా–బెంగళూరు, బెంగళూరు–కోల్‌కతా, ఢిల్లీ–ఇస్తాంబుల్, ముంబై–ఇస్తాంబుల్, బెంగళూరు– ఝర్సుగూడ, హైదరాబాద్‌–బగ్దోరా, కోచి– హైదరాబాద్‌ తదితర సర్వీసులున్నాయి.  బుధవారం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో ఉన్న దుమ్నా విమానాశ్రయాన్ని పేల్చి వేస్తానంటూ ఆ ఆగంతకుడు ఫోన్‌లో చేసిన బెదిరింపు వట్టిదేనని తేలింది.

మెటా, ఎక్స్‌లను సమాచారం కోరిన కేంద్రం
విమానాలకు బాంబు బెదిరింపులు కొనసా గుతుండటాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వీటి వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజా సంక్షేమంతో ముడిపడి ఉన్న అంశం కావడంతో పలు విమానయాన సంస్థలకు పదేపదే అందుతున్న బెదిరింపు హెచ్చరికలకు సంబంధించిన పూర్తి డేటాను అందజేయాలని సామాజిక మాధ్యమ వేదికలైన మెటా, ఎక్స్‌లను కోరింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement