ఇరాన్ దాడి అమానుషం: ప్రధాని మోదీ | PM Modi Reacts To Iran Strikes On UAEs Fujiarah Injured 3 Indians, Says Targeting Civilians And Infrastructure Unacceptable | Sakshi
Sakshi News home page

ఇరాన్ దాడి అమానుషం: ప్రధాని మోదీ

May 5 2026 12:50 PM | Updated on May 5 2026 1:04 PM

Unacceptable PM Modi After Iran's Attack

న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు పొరుగు దేశాలకు పాకుతున్నాయి. తాజాగా యూఏఈలోని  కీలకమైన ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీస్ జోన్‌పై ఇరాన్ చేసిన దాడి ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన తొలి భారీ దాడి ఇదే. ఈ  దాడిలో ముగ్గురు భారతీయులు గాయపడటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆమోదయోగ్యం కాదు: ప్రధాని మోదీ
సామాన్య పౌరులు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ కష్టకాలంలో యూఏఈకి భారత్ పూర్తి అండగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు. దౌత్యం, పరస్పర చర్చల ద్వారానే అన్ని సమస్యలకు శాంతియుత పరిష్కారం లభిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ఇరాన్ తన దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ చట్టాలకు లోబడి హార్ముజ్ జలసంధి ద్వారా స్వేచ్ఛా వాణిజ్యానికి సహకరించాలని కోరింది.

డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్
ఫుజైరాపై ఇరాన్ ప్రయోగించిన 15 క్షిపణులు, నాలుగు డ్రోన్లను తమ వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఒక డ్రోన్ అక్కడి చమురు కేంద్రంపై పడటంతో మంటలు చెలరేగి, అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. బ్రిటన్‌కు చెందిన రెండు కార్గో నౌకలు సైతం ఈ దాడుల వల్ల మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ దాడిపై ఇరాన్ నేరుగా స్పందించకపోయినా.. అమెరికా, యూఏఈలు అకారణంగా బురదలో కూరుకుపోవద్దని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి హెచ్చరించారు.
 

హార్ముజ్ జలసంధిలో రగులుతున్న అగ్నిజ్వాలలు
ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని దిగ్బంధించిన ఇరాన్ తీరుతో గ్లోబల్ మార్కెట్లలో చమురు ధరలు మండిపోతున్నాయి. అక్కడ చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలకు రక్షణగా తమ బలగాలను పంపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఈ జలసంధిని మూసివేసింది. ఇప్పుడు జరుగుతున్న ఈ తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మరోసారి పూర్తిస్థాయి యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement