పెరిగిన ఇంధన భారం
అంతర్జాతీయ విమాన సర్వీసుల కోత!
టాటా గ్రూప్ నేతృత్వంలోని ఎయిరిండియా అంతర్జాతీయ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు విపరీతంగా పెరగడం, నిర్వహణ వ్యయం భారంగా మారడంతో మే నెలలో పలు కీలక అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులను భారీగా తగ్గించింది. వివిధ మార్గాల్లో 5 శాతం నుంచి ఏకంగా 25 శాతం వరకు విమానాల రద్దు జరిగినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం.
ముఖ్యమైన రూట్లలో కోతలు ఇలా..
చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) మే 1 నుంచి అంతర్జాతీయ విమాన ఇంధన ధరలను 5 శాతం పెంచడంతో ఎయిరిండియా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
ఉత్తర అమెరికా: ఈ మార్గంలో కార్యకలాపాలను 20 శాతం తగ్గించారు. షెడ్యూల్ చేసిన 200 విమానాల్లో సుమారు 40 విమానాలను రద్దు చేశారు.
యూరోప్: పారిస్, కోపెన్హాగన్, జ్యూరిచ్ వంటి నగరాలకు వారంతపు సర్వీసులను తగ్గించారు. మొత్తం 450 విమానాల్లో దాదాపు 20 విమానాలు రద్దు అయ్యాయి.
ఆస్ట్రేలియా: మెల్బోర్న్, సిడ్నీ రూట్లలో వారానికి నడిచే ఏడు విమానాల్లో రెండింటిని నిలిపివేశారు.
ఆగ్నేయ ఆసియా: ఈ ప్రాంతానికి సర్వీసులను 10 శాతం వరకు కుదించారు.
కారణాలేమిటి?.. సీఈఓ వివరణ
నెట్వర్క్ ఆప్టిమైజేషన్, డిమాండ్లో మార్పులు, పెరుగుతున్న ఇంధన ధరలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. ఎయిరిండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్బెల్ విల్సన్ ఉద్యోగులకు రాసిన లేఖలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ‘పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. విమాన మార్గాల మూసివేత వల్ల ప్రయాణ కాలం పెరగడం, కరెన్సీ మార్పిడి రేట్లలో హెచ్చుతగ్గుల వల్ల అనేక అంతర్జాతీయ సర్వీసులు నష్టాల్లో నడుస్తున్నాయి’ అని చెప్పారు.
దేశీయ విమాన సర్వీసులపై ప్రభుత్వ జోక్యం వల్ల ధరల ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ రూట్లలో మాత్రం భారం తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. జూన్, జులై నెలల్లో కూడా పరిస్థితులను బట్టి షెడ్యూల్లో మార్పులు ఉండొచ్చని సూచించారు.
ఇండిగో, అంతర్జాతీయ సంస్థల పరిస్థితి
మరోవైపు, ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రస్తుతం వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. మే నెలలో అంతర్జాతీయ సర్వీసులను యథాతథంగా కొనసాగిస్తున్నప్పటికీ గతేడాదితో పోలిస్తే గల్ఫ్ దేశాలకు సర్వీసులను ఇప్పటికే 10 శాతం తగ్గించింది. అంతర్జాతీయంగా చూస్తే.. లుఫ్తాన్సా మే నుంచి అక్టోబర్ మధ్య ఏకంగా 20,000 విమానాలను రద్దు చేయగా క్వాంటాస్ భారత్కు నడిపే తన సర్వీసులను అక్టోబర్ వరకు తగ్గించుకుంది.
ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన


