కేబీసీలో ప్రశ్న.. అమితాబ్‌పై కేసు

BJP MLA Seeks Action Against Amitabh Bachchan Over KBC Question - Sakshi

ముంబై: అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం అత్యంత ప్రజాదరణ పొందింది. అలాంటిది ఈ కార్యక్రమంలో హిందువులను కించపరిచారంటూ మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అభిమన్యు పవార్‌ ఆరోపించారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యాత అమితాబ్‌ బచ్చన్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సోనీ టెలివిజన్‌లో అక్టోబర్‌ 30న ప్రసారమైన ఈ కార్యక్రమానికి సామాజిక కార్యకర్త బెజవాడ విల్సన్, నటుడు అనూప్‌ సోని అతిథులుగా వచ్చారు.

కార్యక్రమంలో భాగంగా రూ.6.40 లక్షల ప్రైజ్‌మనీ కోసం‘1927 డిసెంబర్‌ 25న డాక్టర్‌ అంబేడ్కర్, అతని అనుచరులు ఈ ప్రతుల్లో వేటిని తగులబెట్టారు?’ అనే ప్రశ్నను అమితాబ్‌ అడిగారు. ఎ)విష్ణు పురాణం, బి) భగవద్గీత, సి) రుగ్వేదం, డి) మనుస్మృతి అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. కుల వివక్ష, అస్పృశ్యతలను వ్యతిరేకిస్తూ అంబేడ్కర్, అతని అనుచరులు మనుస్మృతి ప్రతులను తగులబెట్టారని ఆ తర్వాత అమితాబ్‌ ప్రశ్నకు సమాధానంగా వివరణ ఇచ్చారు. అయితే, ఈ ప్రశ్న హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ అమితాబ్‌పై, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై చర్యలు తీసుకోవాలని అభిమన్యు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన సమాధానాలన్నీ హిందూమతానికి సంబంధించిన గ్రంథాలవని, ప్రశ్నలోని ఉద్దేశం హిందువుల మనోభావాలు కించపరచడమేనని అభిమన్యు ఆరోపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top