రేపు 60 బొగ్గు బ్లాకుల వేలం | Auction of 60 coal blocks tomorrow | Sakshi
Sakshi News home page

రేపు 60 బొగ్గు బ్లాకుల వేలం

Jun 20 2024 4:11 AM | Updated on Jun 20 2024 4:11 AM

Auction of 60 coal blocks tomorrow

హైదరాబాద్‌లో ప్రారంభించనున్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి 

హాజరుకానున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లోని 60 బొగ్గు బ్లాకుల కోసం 10వ రౌండ్‌ కమర్షియల్‌ బొగ్గు గనుల వేలాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణలోని ఒక బొగ్గు గని, ఒడిశాలోని 16, ఛత్తీస్‌గఢ్‌ 15, మధ్యప్రదేశ్‌ 15, జార్ఖండ్‌ 6, పశ్చి మబెంగాల్‌ 3, బిహార్‌లోని 3, మహారాష్ట్రలోని ఒక బొగ్గు గనికి కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహించనుంది. 

ఈ నెల 21న హైదరాబాద్‌లో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్‌ చంద్ర దూబే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్‌లాల్‌ మీనా తదితరులు పాల్గొంటారు. 

ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన కోసమంటూ.. 
బొగ్గు గనుల వేలానికి సంబంధించి కేంద్ర బొగ్గు శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈ వేలంలో 60 బొగ్గు బ్లాక్‌లను వేలం వేయనున్నారు. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ బ్లాక్‌లు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదం చేస్తాయి. 10వ రౌండ్‌లో మొత్తం 60 బొగ్గు గనులు ఉండగా.. అందులో 24 గనుల్లో పూర్తిగా, మిగతా 36 గనుల్లో పాక్షికంగా అన్వేషణ జరిగింది.

వేలంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగం వారికి సమాన అవకాశం ఉంటుంది. సొంత వినియోగం, విక్రయం సహా వివిధ ప్రయోజనాల ను పొందవచ్చు. ఎలాంటి పరిమితులు ఉండవు..’’అని పేర్కొంది. సులభతర వాణిజ్యం కోసం, బొగ్గు గనుల సత్వర నిర్వహణకు వీలుగా వివిధ అనుమతులు పొందేందుకు సింగిల్‌ విండో క్లియరెన్స్‌ సిస్టమ్‌ పోర్టల్‌ను రూపొందించినట్టు తెలిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement