
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా బస్తర్లో దారుణం జరిగింది. భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి అడిషనల్ ఎస్పీ మరణించారు. మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
గత మే నెలలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా 27 మంది మృతి, ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ ఆ పార్టీ జూన్10న దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు మే 11 నుంచి ఆగస్టు 3 వరకు స్మారక సభలు నిర్వహించాలని తెలిపింది.
భారత్ బంద్ పిలుపుతో మావోయిస్టులు ఎక్కువ ఉండే బస్తర్లో ఈరోజు తెల్లవారుజామున కొంటా-ఎర్రబోర్ రోడ్డులోని దొండ్రా గ్రామం సమీపంలో సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించేందుకు అడిషనల్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) ఆకాష్ రావు గిరిపుంజే, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించేందుకు వెళ్లారు. అప్పటికే భద్రతా బలగాల్ని నిలువరించేందుకు సిద్ధంగా ఉన్న మావోయిస్టులు పెట్రోలింగ్ చేసేందుకు వచ్చిన ఏఎస్పీ ఆకాష్ రావు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీతో పేల్చారు.
ఈ ఘటనలో ఏఎస్పీతో పాటు ఇతర భద్రతా బలగాలు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన రెస్క్యూ టీం గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థాయి తీవ్రంగా ఉండడంతో ఏఎస్పీని ఎయిర్లిఫ్ట్లో మరో ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఏఎస్పీ మృతి చెందారు. మిగిలిన భద్రతా బలగాల ఆరోగ్యం స్థిమితంగా ఉన్నట్లు తెలుస్తోంది.