UP Police File FIR Against Lucknow Woman For Thrashing Car Driver In Viral Video - Sakshi
Sakshi News home page

Arrest Lucknow Girl: క్యాబ్‌ డ్రైవర్‌పై దాడి.. ఎట్టకేలకు యువతిపై ఎఫ్‌ఐఆర్‌

Aug 3 2021 2:21 PM | Updated on Aug 3 2021 5:57 PM

Arrest Lucknow Girl Viral Video Police File FIR Against Woman - Sakshi

సిగ్నల్‌ దగ్గర ఓ క్యాబ్‌ డ్రైవర్‌ను, అతనికి సపోర్ట్‌గా వచ్చిన మరో వ్యక్తిని ఉత్తపుణ్యానికే రెచ్చిపోతూ చితకబాదింది ఓ యువతి. ఉత్తర ప్రదేశ్‌ లక్నో అవుధ్‌ సిగ్నల్‌ దగ్గర జులై 30న రాత్రి 9.40కి ఈ ఘటన జరగ్గా.. మూడు రోజుల తర్వాత సోషల్‌ మీడియా, మీడియా ద్వారా విపరీతంగా వైరల్‌ అయ్యింది ఆ వీడియో. దీంతో ఆ యువతిని అరెస్ట్‌ చేయాలంటూ పెద్ద ఎత్తునే నిరసన నడిచింది.. ఇంకా నడుస్తోంది. 

ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు.  ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గరి కెమెరాల ఆధారంగా అక్కడేం జరిగిందో మీడియాకు వివరించారు. సిగ్నల్‌ పడకముందే రోడ్డు క్రాస్‌ చేయాలని ప్రయత్నించిన యువతి.. సరిగ్గా సిగ్నల్‌ పడిన టైంలో వేగంగా వస్తున్న ఓ కారు ముందట ఆగింది. ఆ వెంటనే క్యాబ్‌ డ్రైవర్‌ మీద ఊగిపోతూ.. ఆమె దాడి చేయడం రికార్డయ్యింది. ఫోన్‌ పగలకొట్టడంతో పాటు కారులో ఉన్న 600రూ. లాగేసుకుంది.  అదంతా అంతా అక్కడే ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌, వాహనదారులంతా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. చాలాసేపు ట్రాఫిక్‌ కూడా జామ్‌ అయ్యింది. దీంతో పోలీసులు వచ్చారు.

అటుపై యువతిని, ఆ క్యాబ్‌ డ్రైవర్‌ను.. అందులో ఉన్న అతని ముగ్గురి స్నేహితుల్ని పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా తనకు చిన్న గాయం కూడా అయ్యిందని, తనకు న్యాయం చేయాలని పోలీసుల ముందు వాపోయింది ఆ యువతి. దీంతో సదాత్‌ అలీ సిద్ధిఖీపై నిర్లక్క్ష్య పూరిత డ్రైవింగ్‌ నేరం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకుని.. స్టేషన్‌లోనే ఉంచారు. ఆపై పూచీకత్తు మీద  రిలీజ్‌ చేశారు. వైరల్‌ వీడియో ద్వారా ఈ మొత్తం విషయం బయటకు రావడంతో..  క్యాబ్‌ డ్రైవర్‌కు న్యాయం చేయాలంటూ ట్విటర్‌ హోరెత్తింది. కళ్ల ముందు ఏం జరిగిందో కనిపిస్తున్నా.. పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యువతి అరెస్ట్‌ డిమాండ్‌ చేస్తూ.. #ArrestLucknowGirl హ్యాష్‌ ట్యాగ్‌ నడిపించారు. మరోవైపు ఆ యువతి ఆచూకీ కోసం ఇంటర్నెట్‌లో విపరీతంగా వెతికారు నెటిజన్స్‌.

ఈ పరిణామాల తర్వాత సోమవారం కృష్ణా నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో యువతిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. ఉద్దేశపూర్వకంగా దాడి, వస్తువుల్ని నాశనం చేసిన నేరాల కింద కేసు నమోదు అయినట్లు లక్నో అదనపు డీసీపీ చిరంజీవ్‌​నాథ్‌ సిన్హా వెల్లడించారు. ఇది తన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని, న్యాయం కావాలని బాధితుడు కోరుతున్నాడు. ఇంకోవైపు ఈ యువతి పేరు ప్రియదర్శిని అంటూ కొందరు.. ఆ అమ్మాయి ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement