
చెన్నై: తమిళనాట సంచలనం సృష్టించిన అన్నా వర్సిటీ విద్యార్థిని అత్యాచార కేసులో(Anna University Sexual Assault Case) సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడు జ్ఞానశేఖరన్ను దోషిగా ప్రకటించిన చెన్నై మహిళా కోర్టు.. సోమవారం జీవితఖైదును ఖరారు చేసింది. దోషి మీద న్యాయస్థానం ఎలాంటి కనికరం చూపించబోదని.. కనీసం 30 సంవత్సరాలైనా అతను జైలు శిక్ష అనుభవించాల్సిందే అని శిక్ష సందర్భంగా జడ్జి ఎం రాజలక్ష్మి వ్యాఖ్యానించారు.
కిందటి వారమే 11 అభియోగాల మీద అతన్ని కోర్టు దోషిగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జ్ఞానశేఖరన్కు జీవిత ఖైదుతో పాటు రూ.90 వేల జరిమానా కూడా విధించింది కోర్టు. ఈ క్రమంలో.. తనకు జబ్బుపడిన తల్లి, 8 ఏళ్ల కూతురు ఉన్నారని.. కాబట్టి తనకు తక్కువ శిక్ష విధించాలని జ్ఞానశేఖరన్ చేసిన అభ్యర్థనను చెన్నై మహిళా కోర్టు(Chennai Mahila Court) తిరస్కరించింది. తల్లి, బిడ్డ ఉన్నారని నేరం చేసే టైంలో గుర్తుకు రాలేదా? అని జ్ఞానశేఖరన్ను జడ్జి సూటిగా ప్రశ్నించారు. దీంతో కోర్టులో అతను మౌనంగా తలదించుకున్నాడు.
👉కిందటి ఏడాది డిసెంబర్ 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో క్యాంపస్లో విద్యార్థిని(19) తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. అతనిపై దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనతో విద్యార్థులు భగ్గుమన్నారు. క్యాంపస్లోకి చొచ్చుకెళ్లి తీవ్ర నిరసనలు తెలిపారు. విద్యార్థుల ఆగ్రహం, రాజకీయ విమర్శల నేపథ్యంలో కేసును సిట్ ద్వారా దర్యాప్తు చేయించాలని మద్రాస్ హైకోర్టు(madras High Court on Anna University Incident) ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు..
👉ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే స్థానికంగా బిర్యానీ అమ్ముకునే వ్యాపారి జ్ఞానశేఖరన్(Gnanasekaran)ను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నిందితుడికి గాయాలు కూడా అయ్యాయి. అయితే యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా.. వీడియో తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నించాడని విచారణలో తేలింది. విచారణలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు కూడా తేలింది. అతని నుంచి 100 సవర్ల బంగారం, ఓ లగ్జరీ ఎస్యూవీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
👉ఇంకోవైపు.. ఈ ఘటన రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. నిందితుడు అధికార డీఎంకే పార్టీ సభ్యుడని, ఇంకొంతమంది నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతోందంటూ డీఎంకే ప్రభుత్వంపై విమర్శలతో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. విద్యా సంస్థలలోనూ విద్యార్దినులకు భద్రత కరువైందన్న ఆందోళనను వ్యక్తంచేశాయి. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తో పాటు పలువురు డీఎంకే నేతలతో జ్ఞానేశ్వర్ దిగిన ఫొటోలను వైరల్ చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి.
👉అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓ అడుగు ముందుకు వేసి ఘటనకు నిరసనగా కొరడాతో బాదుకున్నారు. ప్రభుత్వం ఈ కేసులో ముందుకు కదిలేవరకు చెప్పులు వేసుకోనంటూ ప్రతిన బూనారు. మరోవైపు టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ కూడా కేసులో బాధితురాలికి సత్వర న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు. ఈలోపు.. ఈ కేసుపై మద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని తెలిపింది. ‘‘అసలు మహిళల భద్రతపై ఎవరికీ అసలు చిత్తశుద్ధి లేదు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరం వాడుకుంటున్నారు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
👉మరోవైపు నిందితుడు అధికార పార్టీ సభ్యుడనే ప్రతిపక్షాల విమర్శలను ప్రభుత్వం తిప్పికొట్టింది. నిందితుడు డీఎంకే మద్దతుదారుడే తప్ప.. పార్టీ సభ్యుడు కాదంటూ స్వయానా సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రకటించారు. కేసు తీవ్రత దృష్ట్యా కేవలం ఐదు నెలల్లోనే విచారణ ముగిసింది. ఈ కేసులో పోలీసులు 100 పేజీల ఛార్జీషీట్ను దాఖలు చేశారు. మొత్తం 29 మంది సాక్షులను మహిళా కోర్టు విచారించి శిక్ష విధించింది. అయితే..
కోర్టు తీర్పుపై రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రతిపక్ష నేత పళనిస్వామి.. ‘సర్’ అంటూ జ్ఞానశేఖరన్ గతంలో చేసిన వ్యాఖ్యలను మరోసారి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ కేసు నుంచి ఇంకా ఎవరినో రక్షించే ప్రయత్నం జరుగుతోందంటూ పోలీసుపైనా ఆరోపణలకు దిగారాయన.
ఈ కేసులో మరో వివాదం.. బాధితురాలి పేరు, వివరాలు బయటకు రావడం. ఏకంగా ఎఫ్ఐఆర్ కాపీ ఆన్లైన్లో ప్రత్యక్షం కావడంతో అంతా కంగుతున్నారు. అయితే అది కేంద్రం పర్యవేక్షణలో ఉన్న వెబ్సైట్ ద్వారా బయటకువచ్చిందని తమిళనాడు పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు.
ఇదీ చదవండి: బ్రిటన్ గాట్ టాలెంట్లో మన చిన్నారి ప్రతిభ