అమెరికా నుంచి రాగానే అరెస్టు
న్యూఢిల్లీ: అమెరికా నుంచి వచ్చిన గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ను ఢిల్లీలోని న్యాయస్థానం 11 రోజులపాటు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కస్టడీకి అప్పగిస్తూ బుధ వారం ఉత్తర్వులు జారీచేసింది. కరడుగట్టిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కు సోదరుడైన అన్మోల్ను గత ఏడాది అరెస్ట్చేసిన అమెరికా మంగళవారం దేశం నుంచి బహిష్కరించి ప్రత్యేక విమానంలో భారత్కు తరలించింది. ఆ విమానం బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకోగానే ఎన్ఐఏ అధికారులు అరెస్ట్చేశారు.
సాయంత్రం ఢిల్లీలోని పటియాలా కోర్టుల ప్రాంగణంలోని కోర్టులో జడ్జి ప్రశాంత్ శర్మ ఎదుట హాజరుపరిచారు. లోతుగా విచారించేందుకు తమకు 15 రోజులపాటు అన్మోల్ను అప్పగించాలని కోరారు. దీంతో 11 రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ప్రశాంత్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. నేరముఠాలకు, ఉగ్రవాద సంస్థలకు మధ్య సంబంధాల కేసులో అన్మోల్ను అరెస్ట్ చేసినట్లు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాహుల్ త్యాగి చెప్పారు.
2024 అక్టోబర్లో మహారాష్ట్ర ఎన్సీపీ నేత, మాజీమంత్రి బాబా సిద్ధిఖీ హత్య, 2024 ఏప్రిల్లో ముంబైలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు, 2022లో ప్రముఖ పంజాబీ యువ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యోదంతంలోనూ అన్మోల్పై గతంలో అభియోగాలు మోపారు. హత్యలు, బెదిరింపు వసూళ్లు చేసే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్స్టర్ సిండికేట్లో అన్మోల్ అరెస్ట్తో ఇప్పటిదాకా అరెస్టులు 19కి పెరిగాయి.


