
అన్నానగర్(తమిళనాడు): నాగర్కోయిల్ సమీపంలోని పల్లందురై లూర్దేస్ కాలనీలో నివాసం ఉంటున్న రీగన్(30) మత్స్యకారుడు. ప్రస్తుతం తన పాత ఇంటి దగ్గరే కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. ఇందుకోసం ఏడాది కాలంగా నిరుపయోగంగా ఉన్న పాత ఇంటిని కూల్చివేయాలని రీగన్ నిర్ణయించుకున్నాడు. అక్కడ ఉంచిన వస్తువులను తొలగించే పని గురువారం జరిగింది. ఓ గదిలో ఉన్న బీరువా ఎత్తే ప్రయత్నంలో ఉండగా, దాని కింద నుంచి పెద్ద నాగుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. దీంతో కార్మికులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. దీంతో పాము అక్కడి నుంచి పారిపోయింది.
అనంతరం కార్మికులు బీరువాను తొలగించారు. అక్కడ చూసిన దృశ్యం చూసి షాక్ తిన్నారు. బీరువా కింద ఓ బొందలో బృందాలుగా మెలికలు తిరుగుతున్న పాము పిల్లలు, పాము పిల్లల మధ్య గుడ్లు కూడా పడి ఉన్నాయి. దీంతో వారు పాములు పట్టే సుందరదాస్కు సమాచారం అందించారు. అతను వచ్చి బొందలోంచి పాములను ఒక్కొక్కటిగా బయటకు తీశాడు. అందులో 24 నల్ల పాము పిల్లలు, 7 పాము గుడ్లు ఉన్నాయి. గుడ్లు ముట్టగానే, అవి బయటకి రావడం ప్రారంభించాయి. అనంతరం సుందరదాస్ పాము పిల్లలను, గుడ్లను సంచిలో వేసి వడచేరిలోని అటవీ శాఖ కార్యాలయంలో అప్పగించారు.