అఫ్గన్‌లో 1,500 మంది భారతీయులు.. తరలింపుపై ఉత్కంఠ 

1500 Indians in Afghanistan Evacuation - Sakshi

అధికారులు సహా 1,500 మంది భారతీయులు ఉన్నారంటున్న కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: తాలిబాన్లు ఆదివారం అఫ్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించింది మొదలు అక్కడ ఉన్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. అఫ్గనిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించడంలో ఉత్కంఠ నెలకొంది. ఆగస్టు 5 నాటికి అఫ్గానిస్తాన్‌లో అధికారులు సహా సుమా రుగా 1,500 మంది భారతీయులు ఉన్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది బ్యాంకులు, ఐటీ సంస్థలు, నిర్మాణ సంస్థలు, ఆసుపత్రులు, ఎన్జీవో సంస్థలు, టెలికాం కంపెనీలు, సెక్యూరిటీ కంపెనీలు, యూనివర్శిటీలు, భారత ప్రభుత్వ ప్రాయోజిత ప్రాజెక్టులు, ఐక్యరాజ్యసమితి అనుబంధ మిషన్‌లలో పనిచేస్తున్నారు.

జూలైలోనే  కాందహార్‌లో భారత కాన్సులేట్‌ కార్యాలయ సిబ్బందిని భారత ప్రభుత్వం వెనక్కి రప్పించింది. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం మాత్రం యథావిధిగా పనిచేస్తూ వీసా జారీ తదితర సేవలు అందిస్తోంది. అయితే సోమవారం మధ్యాహా్ననికి కాబూల్‌లోని భారత ఎంబసీలో అధికారులు, సిబ్బంది, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ తదితర పారా మిలిటరీ సిబ్బంది సహా 200 మంది భారతీయులు స్వదేశానికి చేరుకునేందుకు ఎదురుచూస్తున్నట్టు సమాచారం.

కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతీయ వాయుసేనకు చెందిన భారీ విమానం (సి–17 గ్లోబ్‌ మాస్టర్‌) ఒకటి అందుబాటులో ఉందని, దానిలో వీరందరినీ తరలించాలని యతి్నస్తున్నప్పటికీ ఎంబసీ నుంచి విమానాశ్రయానికి చేరే పరిస్థితి లేకపోవడం, విమానాశ్రయం నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో వీరి తరలింపుపై ఉత్కంఠ నెలకొని ఉంది. భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది.

భారత రాయబార కార్యాలయం మూసివేత
అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాబూల్‌లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. ఈ మేరకు భారత ప్రభుత్వం కాబూల్‌లో రాయబార కార్యాలయం మూసివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బందిని తరలించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top