10 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. ఓడిన అభ్యర్థే అసలు విజేత! | 10 Years After Election Madras High Court Declares Defeated Candidate Winner | Sakshi
Sakshi News home page

10 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. ఓడిన అభ్యర్థే అసలు విజేత!

Jun 6 2026 8:53 AM | Updated on Jun 6 2026 8:53 AM

10 Years After Election Madras High Court Declares Defeated Candidate Winner

సాక్షి, చైన్నె : రాధాపురం ఎన్నికల కేసులో హైకోర్టు పదేళ్లకు సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి అన్నాడీఎంకే అభ్యర్థి ఇన్బదురై విజయం చెల్లదని బుధవారం ప్రకటించింది. రీకౌంటింగ్‌ అనంతరం అక్కడ డీఎంకే అభ్యర్థి అప్పావు విజయం సాధించినట్టు తీర్పు వెలువరించారు. వివరాలు.. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో రాధాపురం నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరఫున ఇన్బ బదురై, డీఎంకే తరఫున అప్పావు పోటీ చేశారు. అప్పట్లో కేవలం 104 ఓట్ల స్వల్ప తేడాతో ఇన్బబదురై గెలిచినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను పూర్తిగా లెక్కించకుండానే ఫలితాన్ని ఏకపక్షంగా ప్రకటించారని ఆరోపిస్తూ అప్పావు చైన్నె హైకోర్టును ఆశ్రయించారు. సాధారణంగా ఇలాంటి ఎన్నికల పిటిషన్లపై 6 నెలల్లోపు తీర్పు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఈ కేసులో సుదీర్ఘ కాలయాపన జరిగింది. ఎట్టకేలకు వివాదాస్పద పోస్టల్‌ ఓట్లను తిరిగి లెక్కించగా.. అప్పావు ఆధిక్యం సాధించినట్లు తేలింది. దీంతో హైకోర్టు ఇన్బదురై విజయాన్ని తాజాగా రద్దు చేస్తూ, అప్పావును విజేతగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.

మాజీ ఎమ్మెల్యే హోదా, జీతభత్యాలు రద్దు
పదవీకాలం (2016–2021) ముగిసిపోయిన తర్వా త ఈ తీర్పు వచ్చినప్పటికీ, ఇన్బదురైకు షాక్‌ తప్ప లేదు. 2016 నుండి 2021 వరకు ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఇన్బదురై పొందిన జీతం, రోజువారీ భత్యా లు, ఇతర ప్రభుత్వ ఆర్థిక సదుపాయాలను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అలాగే ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నా జీవితాంతం వచ్చే మాజీ ఎమ్మెల్యే పెన్షన్‌, ఉచిత వైద్య బీమా సదుపాయాలు పూర్తిగా రద్దవుతాయి. 2016–2021 కాలంలో రాధాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రభుత్వ, అసెంబ్లీ రికార్డుల్లో ఎక్కడెక్కడైతే అన్బదురై పేరు ఉందో.. వాటన్నింటినీ తొలగించి ‘అప్పావు’ పేరు పొందు పరిచే విధంగా హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇన్బదురై ప్రస్తుతం అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

ఆలస్యమైనా న్యాయం గెలిచింది
తీర్పు రావడంలో చాలా కాలయాపన జరిగినప్పటికీ, చివరికి న్యాయమే గెలిచిందని మాజీ స్పీకర్‌ అప్పావు సంతోషం వ్యక్తం చేశారు. నాటి ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే 135 సీట్లతో అధికారాన్ని దక్కించుకోగా, డీఎంకే ఈ ఒక్క స్థానాన్ని కోల్పోవడంతో అప్పట్లో 89 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement