నారాయణపేట: ఆలిండియా సివిల్ సర్వీసెస్–2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీవైఎస్ఓ ఎస్.వెంకటేశం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా పోటీలు సెప్టెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లోని ఎల్.బి. స్టేడియం, సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల ప్రభుత్వ ఉద్యోగులు ఆగస్టు 31లోగా స్టేడియం గ్రౌండ్లోని జి ల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో త మ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.
క్రీడాంశాలు : అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, షటిల్ బ్యాడ్మింటన్ , క్రికెట్, చెస్, క్యారమ్స్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, లాన్ టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బెస్ట్ ఫిజిక్, యోగా, ఖో–ఖో.
ధర్నాను విజయవంతం చేయాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని వివేకానంద పార్కు వద్ద టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ జిల్లా చైర్మన్ నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక భవిత కేంద్రంలో టీజీఈ జేఏసీ భాగస్వామ్య సంఘాల బాధ్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమస్యల సాధన కోసం చేపట్టే ధర్నాలో జేఏసీలోని అన్ని భాగస్వామ్య సంఘాలు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ అదనపు కార్యదర్శి జనార్దన్రెడ్డి, కో–చైర్మెన్లు రెడ్డప్ప, భీమయ్య, సూర్యచంద్ర, భాగస్వామ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు క్రీడాకారుల ఎంపిక
నారాయణపేట ఎడ్యుకేషన్: హన్మకొండలో ఈ నెల 26, 27న జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటి పతకాలు సాధించాలని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి రమణ కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్ క్రీడాకారుల ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అండర్–14, 16, 18, 20 విభాగంలో జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి పంపిస్తామన్నారు. పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఖేలో ఇండియా అథ్లెటిక్ కోచ్ హారికదేవి, యాదమ్మ, మహేష్, మమత తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శ గ్రామపంచాయతీగా గొల్లపల్లి ఎంపిక
మక్తల్: రాష్ట్ర ప్రభుత్వం మండలంలోని గొల్లపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేసింది. మొదట ఈ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం గ్రామంలో పాంపాండ్లు, చెక్డ్యాంలు, ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసి మిగతా గ్రామాలకు ఆదర్శంగా తీర్చిదిద్దనున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సూర్యకుమార్ మంత్రి వాకిటి శ్రీహరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.


