నారాయణపేట: పోలీసు అధికారుల సంఘం ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా శుక్రవారం నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 13 పదవులకు 36 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పోలీసు హెడ్క్వార్టర్స్ నుంచి అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్హక్, సర్కిల్ వారీగా సీఐలు, వివిధ విభాగాల వారీగా డీఎస్పీ మహేష్ నామినేషన్లను స్వీకరించారు. ఎన్నికల నోడల్ అధికారిగా డీసీఆర్బీ డీఎస్పీ మహేష్ వ్యవహరించనున్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ శనివారం జరగనుంది.
ఇవీ నిబంధనలు..
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఈ ఏడాది జనవరి 1 నాటికి కనీసం ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఉద్యోగ విరమణకు ఇంకా కనీసం ఐదేళ్ల సర్వీస్ మిగిలి ఉండాలి. మూడేళ్లలో ఎలాంటి మేజర్ పనిష్మెంట్ ఉండకూడదు. అదేవిధంగా సంఘం పదవిని రెండు పర్యాయాల కంటే ఎక్కువగా నిర్వహించి ఉండరాదు. ఆయా నిబంధనల మేరకు నామినేషన్లను పరిశీలించి తిరస్కరించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
25న పోలింగ్..
ఈ నెల 25న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం 4 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు వెల్లడించనున్నారు. అనంతరం ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి తదితరులను ఎన్నుకోనున్నారు. ఎన్నికై న సంఘం మూడేళ్ల పాటు కొనసాగనుంది.
సంక్షేమమే ప్రధాన ఎజెండా..
పోలీసు అధికారుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, సంఘంలో ఐక్యతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 13 పదవులకు 36 నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నికలపై పోలీసు అధికారుల్లో ఆసక్తి నెలకొంది.


