నారాయణపేట ఎడ్యుకేషన్: సైబర్ నేరాలు, డ్రగ్స్ రవాణా, వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ నల్లపు లింగయ్య సూచించారు. మ న ఊరు–మన పోలీస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన మండలంలోని లింగంపల్లిలో పర్యటించి గ్రామస్తులకు పోలీస్శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించారు. శాంతిభద్రతలు, చట్టపరమైన అంశాలు, ప్రజల భద్రతకు సంబంధించిన సమాచారాన్ని గ్రామస్తులకు చేరవేసేందుకు గ్రామంలో పోలీస్వాల్ ఏర్పా టు చేశామని.. ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులు, నకిలీ ఆఫర్లు, బ్యాంకింగ్ మోసాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ, పిన్, సీవీవీ, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్వర్డ్లు ఇతరులకు వెల్లడించరాదని సూచించారు. ఎవరైనా సైబర్క్రైం బారినపడితే వెంటనే హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఎస్ఐ సతీష్రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


