నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర సాధనకు జీవితాంతం పోరాడిన మహనీయుడు ప్రొ. కొత్తపల్లి జయశంకర్ అని కలెక్టర్ ప్రియాంక అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయశంకర్ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఆయన చేసిన కృషి, అందించిన స్ఫూర్తి ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. తెలంగాణ సామాజిక, ఆర్థిక పరిస్థితులపై జయశంకర్ చేసిన అధ్యయనాలు, పరిశోధనలు రాష్ట్ర సాధన ఉద్యమానికి దిశానిర్దేశం చేశాయని తెలిపారు. తెలంగాణ సాధనకు చేసిన త్యాగాలు, ఆయన ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శమని చెప్పారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఆయన రచనలు, ఆలోచనలు భవిష్యత్తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. తెలంగాణ సాధించిన అనంతరం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జయశంకర్ కలలుగన్న సమానత్వం, అభివృద్ధి, ప్రజా సంక్షేమ తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్డీసీ రాజేందర్గౌడ్, ఏఓ అనిల్కుమార్, బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీపీఆర్వో రషీద్ పాల్గొన్నారు.


