నారాయణపేట: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో రోడ్డు భద్రతపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 13 నుంచి 18వ తేదీ వరకు అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో నిర్వహించాలని ఎస్పీ డా. వినీత్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పోలీస్ అధికారులతో టెలీ కాన్ఫరెనన్స్ నిర్వహించి మాట్లాడారు. రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఒక్క నిర్లక్ష్యం.. ఒక కుటుంబం నాశనం అనే సందేశంతో ప్రజల్లో బాధ్యత పెంపొందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామస్థాయిలో రోడ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటు, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన, అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలపై ప్రమాణ స్వీకారం, బ్లాక్స్పాట్ల గుర్తింపు, ప్రమాదాల నివారణ చర్యలు, పిల్లల కోసం ప్రత్యేక రోడ్ సేఫ్టీ డే నిర్వహణ, హెల్మెట్, సీట్బెల్ట్ ప్రాముఖ్యతపై అవగాహన, గోల్డెన్ అవర్పై పోలీస్, అంబులెన్న్స్ సిబ్బంది, వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ తదితర కార్యకమ్రాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగితే వెంటనే సమాచారం ఇవ్వడానికి ప్రత్యేక హాట్లైన్ నంబర్ 88898 08182 ఏర్పాటు చేశామని, సమాచారం ఇవ్వాలని సూచించారు. శిక్షల కంటే అవగాహనతో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాల పరిసరాల్లో జీబ్రా క్రాసింగ్లు, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేసి చిన్నారుల భద్రతను బలోపేతం చేయాలని సూచించారు. బాధ్యతగా డ్రైవింగ్ చేస్తే సమాజం మారుతుందని, ప్రతి గ్రామం సురక్షితంగా మారితే జిల్లా సురక్షితం అవుతుందని ఎస్పీ పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు.


