నారాయణపేట
శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026
నర్వ: జిల్లా రైతులు యాసంగిలో సాగు చేసిన పంట వివరాల నమోదుకు వ్యవసాయశాఖ డిజిటల్ క్రాప్ ద్వారా సర్వే చేపడుతోంది. వలంటీర్లు ఫిబ్రవరి 27 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల సాగు వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా యాసంగి సాగు వివరాల నమోదుకు ఆన్లైన్ సర్వే ప్రారంభించారు. ఈసారి సర్వేకు ప్రత్యేకంగా వలంటీర్లను నియమించగా.. ఒక్కొక్కరు గరిష్టంగా 3,550 సర్వేనంబర్ల వరకు చేపడుతున్నారు. ఎక్కువ నంబర్లు ఉన్న గ్రామాలు, పటాలు లేని గ్రామాలు, భూముల హద్దుల లేనిచోట ఏఈఓలు సర్వే చేస్తున్నారు. 45 రోజుల్లో సర్వే పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించిన పంట వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ రైతు పోర్టల్లో నమోదు చేస్తున్నారు.
యువతకు తాత్కాలిక ఉపాధి..
వలంటీర్లుగా విద్యావంతులైన గ్రామీణ యువతకు ప్రాధానమిచ్చారు. స్మార్ట్ఫోన్ వినియోగంపై అవగాహన ఉండి కనీసం పదోతరగతి చదివిన వారికి అవకాశం కల్పించారు. గ్రామంలోని భూములు, సాంకేతికతపై అవహహాన ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. వారు క్షేత్రస్థాయికి వెళ్లి 50 మీటర్ల రేడియస్ నుంచి సర్వేనంబర్ల వారీగా పంటల నమోదు చేస్తున్నారు. వీరికి ఫొటోకు రూ.7 చొప్పున పారితోషికం అందిస్తారు. శాటిలైట్ మ్యాపింగ్ లేని గ్రామాల్లో మాత్రం ఏఈఓలు పంటల నమోదు చేస్తారు.
జిల్లాలో ఇలా..
గ్రామాలు
280
మండలాలు
13
ఏఈఓ క్లస్టర్లు
77
రెవెన్యూ గ్రామాలు
239
సర్వేలో పాల్గొనాల్సిన వలంటీర్లు
232
ఇప్పటి వరకు పాల్గొన్న వలంటీర్లు
206
నమోదు చేయాల్సిన సర్వేనంబర్లు
4,40,506
ఇప్పటి వరకు నమోదు చేసింది
92,880
21.4%
పూర్తయిన శాతం
రెండేళ్లుగా పత్తి సాగుకే మొగ్గు..
గతేడాది పత్తికి అధిక డిమాండ్ ఉండటంతో ఈ ఏడాది కూడా రైతులు వానాకాలం, యాసంగిలోనూ అదే పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే నీటివసతి ఉన్న ప్రాంతాల్లో వరి సాగవుతుంది. ప్రభుత్వం వరికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి మద్దతు ధర చెల్లిస్తుండటంతో సాగుకు సిద్ధమవుతున్నారు. వీటితోపాటు పప్పు ధాన్యాలైన కంది సాగుకు కొందరు రైతులు మొగ్గు చూపుతున్నారు. అలాగే నూనెగింజల సాగును పెంచాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించి రైతులను ప్రోత్సహిస్తుండటంతో ఆసక్తి కలిగిన రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు.
ప్రయోజనాలు ఇలా..
జిల్లాలో 77 ఏఈఓ క్లస్టర్లుండగా 4,40,506 సర్వే నంబర్లలో వివిధ రకాల పంటలు సాగుచేస్తున్నారు.
వలంటీర్లు, ఏఈఓలు స్మార్ట్ఫోన్ యాప్లో తెలంగాణ భూనక్ష కడస్ట్రాల్ మ్యాప్ను అనుసంధానించి ఉపగ్రహ సాంకేతికతతో అక్షాంశాలు, రేఖాంశాలు, ధరణి చిత్రపటాల ఆధారంగా పంటలు, వాటి వివరాల నమోదు చేయాలి.
యాప్లో 50 మీటర్ల పరిధిలోని సర్వేనంబర్లు మాత్రమే కనిపిస్తాయి. దీంతో నమోదు చేసే వారు తప్పనిసరిగా రైతు క్షేత్రానికి వెళ్లాల్సిందే.
పొలాలకు వెళ్లి భూ నక్ష మ్యాప్ ఆన్చేసి రైతు పేరు భూ విస్తీరణం, ఆధార్, గ్రామం, గతంలో, ప్రస్తుతం సాగుచేసిన పంట రకం, పెట్టుబడి, చీడపీడలు, నష్టం, ఎరువుల వాడకం, పంట ఫొటోతో సహా యాప్లో అప్లోడ్ చేయాలి.
ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయినప్పుడు ఈ వివరాలతో పరిహారం చెల్లింపు, బీమా అమలు, రాయితీల కల్పన తదితరాలు సులువు అవుతాయి.
వివరాల నమోదులో కచ్చితత్వంతో ఉత్పత్తుల విక్రయంలో రైతులకు ఇబ్బందులు ఉండవు.
నేల స్వభావం, సాగునీటి లభ్యత, గతంలోని చీడపీడలు, వాతావరణం, దిగుబడి తదితరాల అధారంగా వచ్చే సీజన్లో ఏ పంటలు సాగుచేయాలో సూచిస్తారు.
చీడపీడల నివారణకు మందుల రూపకల్పన, నూతన వంగడాల ఆవశ్యకత, శాస్త్రవేత్తల ప్రయోగాలకు మార్గదర్శనంగా ఉండనుంది.
జిల్లాలో కొనసాగుతున్న యాసంగి డిజిటల్ సర్వే
ఈ ఏడాది వలంటీర్లతో.. గరిష్టంగా 3,550 సర్వేనంబర్లు
క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాల నమోదు
45 రోజుల్లో పూర్తిచేయడమే లక్ష్యంగా..
గ్రామ పటాలు లేనిచోట ఏఈఓలతో..


