అడ్డాకుల: ఉగాది పండుగ, తెలుగు కొత్త సంవత్సరం ఆరంభం సందర్భంగా కందూర్ సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామికి గురువారం విశేషాలంకరణ చేశారు. స్వామివారి శివలింగాన్ని పూలు, పండ్లతో అందంగా అలంకరణ చేశారు. ఆలయంలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి గంటకు పైగా సమయం పట్టడం భక్తుల రద్దీని సూచిస్తోంది. ఆలయం వద్ద జాతర కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. మట్టి కుండలు, గాజుల దుకాణాలు, మిఠాయి షాపుల వద్ద రద్దీ కనిపించింది. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు.


