నారాయణపేట: మహిళలు పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణించాలని ఎస్పీ డా. వినీత్ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని ఓ గార్డెన్స్లో ఓఎంఐఎఫ్ (ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మహిళలకు కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లు, నిత్యావసర సరుకులు అందజేశారు. అదేవిధంగా సంస్థలో పనిచేస్తున్న మహిళల్లో కొందరు గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు, వార్డుసభ్యులుగా ఎన్నికయ్యారు. వారిని ఎస్పీ శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు ఉన్నారని, అందరికీ సమాన హక్కులు ఉన్నాయని, సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగాలని సూచించారు. మహిళలు ఉన్నతంగా ఎదగాలంటే చదువు అత్యంత ప్రధానమని, మహిళ చదువుకుంటే వారి కుటుంబం మాత్రమే కాకుండా తరతరాల భవిష్యత్ మెరుగుపడుతుందన్నారు. గ్రామాల్లోని కుటుంబాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ లక్ష్మీపతిగౌడ్, అడిషనల్ పీపీ సురేష్, ఓఎంఐఎఫ్ స్టేట్ డైరెక్టర్ డా. బెరిల్ డిసౌజా, ప్రాజెక్టు మేనేజర్ ఎంజెలా దేవిస్, జిల్లా కో–ఆర్డినేటర్ హాజమ్మ, జోష్, సీడబ్ల్యూసీ చైర్మన్ అశోక్ శ్యామల, యాదయ్య, కమల, సఖికేంద్రం సభ్యులు క్రాంతి, కవిత, కౌన్సిలర్ మహేష్, మహిళలు పాల్గొన్నారు.


