ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా సీఎం వ్యాఖ్యలు
నారాయణపేట: సీఎం హోదాలో ఉన్న రేవంత్రెడ్డి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి అన్నారు. సీఎం చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ లింగయ్యకు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో అత్యంత చౌకబారు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ఉద్యమనేత, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును దెబ్బతీయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలి.. ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి అంటూ సీఎం వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరును ఉపయోగించి రాజకీయ కక్ష సాధించడం సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అని అన్నారు. అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్రావుకు సిట్ నోటీసులు జారీ చేయడం సరైందికాదన్నారు. కోర్టు నుంచి క్లిన్ చిట్ వచ్చినప్పటికీ సిట్ పేరుతో వేధింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విజయసాగర్, చెన్నారెడ్డి, సుదర్శన్రెడ్డి, ప్రతాప్రెడ్డి, గురులింగం, బోయ లక్ష్మణ్, సురేందర్రెడ్డి పాల్గొన్నారు.


