మహిళా సంక్షేమానికి పెద్దపీట
● కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
● రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి అనేక పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళాశక్తి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు రూ. 45లక్షల వడ్డీ లేని రుణాల చెక్కులతో పాటు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగా ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా స్వయం ఉపాధి రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రభుత్వం అందించే రుణాలతో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని మంత్రి సూచించారు. మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. తాను మంత్రి పదవి చేపట్టిన అనతి కాలంలోనే రూ. వెయ్యి కోట్లకు పైగా నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. నియోజకవర్గ ప్రజలకు 10వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు. మక్తల్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. అబివృద్ధికి ఎవరు అడ్డు పడినా ఇక ఆగదని.. గతంలో ఓ లెక్క, ఇప్పుడు మరో లెక్క అని మంత్రి అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసులు, బీకేఆర్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు, తహసీల్దార్ సతీశ్కుమార్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, ఫయాజ్, శ్రీనివాసులు, రంజిత్కుమార్రెడ్డి, కావాలి ఆంజనేయులు, తాయప్ప తదితరులు పాల్గొన్నారు.


